Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాల్లో పుకార్లు..భయాందోళనలలో జనం
- ఇందులో నిజం లేదు..వాట్సాఫ్ పుకార్లను
- నమ్మొద్దంటున్న జిల్లాల ఎస్పీలు
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
నరరూప రాక్షసులైన పార్ధీ గ్యాంగ్ గ్రామాలలో తిరుగుతూ చిన్న పిల్లల్ని ఎత్తుకు పోతున్నారు. వృద్దులను కూడా విడవడం లేదు. తీసుకెళ్లి చంపుతున్నారు అనే పుకార్లతో దాదాపు తెలంగాణలోని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏ నోట విన్న ఇదే మాట, అదే భయం నెలకొంది. కొన్ని వారాలుగా ఈ పుకార్లు గ్రామాలను చుట్టుముట్టాయి. ఎవరు ప్రచారం చేస్తున్నారో తెలియదు, ఎక్కడి నుంచి వార్తలు వస్తున్నాయో అంతకన్నా తెలియదు కాని దాదాపుగా స్మార్ట్ ఫోన్లలో ఈ వదంతులు పుంఖాను పుంఖాలుగా వ్యాప్తి చెందుతున్నాయి. పార్ధీ ముఠాకు చెందిన సభ్యులు చిన్న పిల్లల్ని ఎత్తుకు పోయి చంపేస్తున్నారనే భయంతో అనేక గ్రామాలలో దాదాపు రెండు వారాలుగా ప్రజలు నిద్రకు దూరం అయ్యారు. సాధారణంగా వేసవి కాలంలో గ్రామస్తులు ఇండ్లలో గాక ఆరుబయట, లేదా వ్యవసాయ క్షేత్రం వద్ద మంచంపైన పడుకోవడం జరుగుతుంది. కాని ఈ భయంతో ఆరు బయట పడుకోవడం మానేశారు. చివరికి తమ పంటపోలాల్లో రాత్రిరి వేళ కాపలా కాసేందుకు వెళ్లే రైతులు సైతం తమ ఇండ్లకే పరిమితమవుతున్నారు. మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట్ మండలం ఇప్పటూరు గ్రామంలో వారం రోజుల నుంచి నిద్రకు దూరమైన గ్రామస్తులు రాత్రి వేళ కర్రలు పట్టుకుని కాపలా కాస్తున్నారు. రాత్రి వేళ ఎవరైనా బయటి వ్యక్తి వస్తే యక్ష ప్రశ్నలు వేసి మరీ వదులుతున్నారు. పక్కనే ఉన్న పోలపల్లి పారిశ్రామిక ప్రాంతంలో సైతం సాయంత్రం ఐదు దాటిందంటే తమ పిల్లల్ని బయట ఆడుకోనియకుండా ఇండ్లలోనే ఉంచుకునే స్థితి ఏర్పడిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అలాగే రంగారెడ్డ కడ్తాల్ మండలం ముధివెన్ గ్రామంలో కూడా ఇలాంటి భయాందోళన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, తమకు తగిన రక్షణ కల్పించాలని గ్రామస్తురాలు గుడిగ మల్లమ్మ నవతెలంగాణకు చెప్పారు. నల్లగొండ, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సూర్యపేట, మహబూబాబాద్, నిర్మల్, అదిలాబాద్, మెదక్, సంగారెడ్డి మొదలైన జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి.
ఇందులో నిజం లేదు..
ఇదిలా ఉంటే పిల్లల్ని ఎత్తుకు పోయే పార్ధీ గ్యాంగ్ గ్రామాలలో తిరుగుతున్నట్టు జరుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ రమారాజేశ్వరి, సూర్యపేట్ ఎస్పీ ప్రకాశ్జాదవ్లు ఆదివారం నవ తెలంగాణతో మాట్లాడుతు స్పష్టం చేశారు. తమ జిల్లాలతో పాటు అనేక జిల్లాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతున్నదని తెలిపారు. నిజానికి ఈ ప్రచారం ఏపీ రాష్ట్రంలోని కర్నూలు, కడప జిల్లాల నుంచి మొదట ప్రారంభమైందని తర్వాత వాట్సాఫ్ల ద్వారా ఇది తెలంగాణ జిల్లాల్లోకి పాకిందని వారు తెలిపారు. తమ జిల్లాల్లో ఈ పుకార్లను నమ్మవద్దని చెబుతూ ప్రతి పోలీసుస్టేషన్ పరిధిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని ఎస్పీలు వివరించారు. పోలీసులే గాక గ్రామాల కావలికార్లు, గ్రామాల పెద్దలతోటి కూడా డప్పులతో చాటింపులు చేయిస్తున్నామని ఎస్పీ రమారాజేశ్వరి వివరించారు. పార్ధీ ముఠాకు చెందిన వారి ద్వారా తమ జిల్లాలో ఒక్క ఘటన కూడా పిల్లల్ని ఎత్తుకుపోయినట్టు నమోదు కాలేదని ఆమె తెలిపారు. నిజానికి గావ్పార్థీ, పాల్పార్ధీ ముఠాలు మహారాష్ట్రకు చెందిన బందిపోటు ముఠాలని వారిపై తమ ప్రత్యేక నిఘా ఎప్పటికి కొనసాగుతుందని సూర్యపేట్ ఎస్పీ ప్రకాశ్జాదవ్ అన్నారు. ఈ పుకార్లకు నుంచి ప్రజల్లో భయాందోళనలు తొలగడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అయినప్పటికి జనంలో భయాందోళనలు పోయేంత వరకు రాత్రి వేళలో గస్తీని పెంచామన్నారు. గ్రామాలలోకి కొత్త వాళ్లు వస్తే వారిని పార్ధీ ముఠా సభ్యులని భావించి కొట్టడం వంటి చర్యలకు పాల్పడొద్దని ఇద్దరు ఎస్పీలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక వేళ ఏదేని అనుమానం ఉంటే పోలీసులకు అప్పగించాలని కోరారు. తమ పరిశీలనలో ఈ పుకార్లకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన స్పష్టం చేశారు.