Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందుకోసం ప్రజల్లో అవగాహన కల్పించాలి
- 'ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం'పై సమాలోచనలో న్యాయవాదులు, మేధావులు
- ఈనెల 25న కలెక్టరేట్ల ముందు ధర్నాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును నిర్వీర్యం చేసేందుకు వీలుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అందరూ వ్యతిరేకించాలని పలువురు న్యాయవాదులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు సూచించారు. ఇందుకోసం అన్ని రకాలుగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ఇదే క్రమంలో చట్టం, సుప్రీంకోర్టు తీర్పు, అందులోని సవరణలు తదితరాంశాలపై విస్తృత ప్రచారం నిర్వహించటం ద్వారా ప్రజల్లో అవగాహన, చైతన్యం కల్పించాలని కోరారు. ఈనెల 25న అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించాలని.. దీనిపై నిరసనను వ్యక్తం చేయాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టుపై సుప్రీంకోర్టు గత మార్చిలో వెలువరించిన తీర్పుపై చర్చించేందుకు ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యాయవాదులతో సమాలోచన కార్యక్రమాన్ని నిర్వహించారు. కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, గిరిజన సంఘం, ఐద్వా, ఆదివాసీ గిరిజన సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి కెవిపిస్ రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్బాబు అధ్యక్షత వహించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.గోపాలరావు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు అనేది రాజ్యాంగబద్ధమైనదని చెప్పారు. దళితులు, గిరిజనులకు అత్యంత కీలకమైన ఈ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించటం శోచనీయమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రోద్భలంతోనే ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు సరికావని వ్యాఖ్యానించారు. అసలు మన ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అని ప్రశ్నించారు. రాజకీయ క్రీడలో భాగంగానే దేశంలో విపరీత పరిణామాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దలకు ఒక రీతిలో.. పేదలు, సామాన్యులకు మరో రీతిలో న్యాయం చెప్పటం సరికాదన్నారు. అట్రాసిటీ యాక్టుకు సవరణలు చేయటాన్నిబట్టి సుప్రీం న్యాయమూర్తుల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. విశ్రాంత న్యాయమూర్తి నిమ్మ నారాయణ మాట్లాడుతూ.. సవరణలపై నిరసన తెలిపేందుకు విస్తృత ప్రజా మద్దతును కూడగట్టాలని సూచించారు.
ప్రజాస్వామ్యవాదులకు, సామాజిక శక్తులకు ఇదొక సవాల్ వంటిదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎమ్.వినోద్ మాట్లాడుతూ.. ప్రజోపయోగ చట్టాలను నిర్వీర్యం చేయటం.. ఇందుకోసం కోర్టులను ఉపయోగించటమే ప్రక్రియ 1951లోనే ప్రారంభమైందని చెప్పారు. ఈ క్రమంలో పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలపై కూడా సుప్రీంకోర్టే నేరుగా నిర్ణయాలను వెలువరిస్తున్నదని విమర్శించారు.
సుప్రీం తన తీర్పును పున:సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు టి.వి.రమేశ్, పొత్తూరి సురేశ్కుమార్, రాంచంద్రారెడ్డి, సత్యనారాయణ, బాబు, సత్యప్రసాద్, వినోద్, తులసీదాస్తోపాటు వ్య.కా.స.రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకటరాములు, నాయకులు పద్మ, ఐద్వా జాతీయ నాయకులు బి.హైమావతి, గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎమ్.ధర్మానాయక్, కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు కె.భాస్కర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేశ్, నాయకులు తిరుపతి, టీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎమ్.శోభన్ నాయక్, డీవైఎఫ్ఐ నాయకులు మహేందర్, మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.