Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 20 మీటర్ల లోతునకు భూగర్భ జలమట్టం
- ఎస్సారెస్పీలో ఉన్నవి 5.8 టీఎంసీలే
నవతెలంగాణ- కరీంనగర్ ప్రతినిధి
ఉభయ గోదావరి జిల్లాలను తలదన్నేలా ధాన్యాన్ని పండించిన కరీంనగర్ జిల్లా నేడు సాగు సంగతి ఏమోగానీ గుక్కెడు నీటికి అల్లాడుతోంది. 3.8టీఎంసీల నీటితో డెడ్స్టోరేజీలో ఉన్న ఎల్ఎమ్డి ఎడారిని తలపిస్తుండగా, జిల్లా వరప్రదాయిని అయిన ఎస్సారెస్పీలో 5.8 టీఎంసీల నీళ్లే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 20మీటర్ల పాతాళానికి నీళ్లు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో తాగునీటికీ తీవ్ర ఇబ్బందిగా మారింది.
గతేడాది వర్షాభావ ప్రభావంతో ప్రస్తుతం భూగర్భజలాలు పడిపోయాయి. నెల రోజుల్లో జిల్లాలో సరాసరి మీటరు లోతుకు నీళ్లు పడిపోయాయి. ముఖ్యంగా ఐదు మండలాల్లో భూగర్భజలాలు ఎక్కువగా అడుగంటి గడ్డుపరిస్థితి ఏర్పడింది. జిల్లా సగటు నీటి మట్టం గతేడాది మే నెలతో పోలిస్తే ఈ మేలో 0.28 మీటర్ల లోతుకు వెళ్లింది. అదే ఏప్రిల్తో పోలిస్తే 0.98 మీటర్ల తేడా కనిపించింది. నెల రోజుల్లోనే 0.32 లోతుకు జలం అడుగంటింది. గ్రామీణ ప్రాంతాల్లో బోర్లు అడుగంటిపోయాయి. 24 గంటల విద్యుత్తుతోనూ నీటి వాడకం పెరిగి భూగర్భజలాలు ఎక్కువగా పడిపోయాయి. నగరంలోని చాలా ఇండ్లల్లోని బోర్లు పనిచేయడం లేదు. జనవరి నుంచి ఏప్రిల్ నాటికి చిగురుమామిడి మండలంలో 7.33 మీటర్లు, కరీంగనగర్ నగరంలో 5.62 మీటర్ల మేర నీళ్లు అడుగంటాయి. గంగాధర, మానకొండూర్, తిమ్మాపూర్, జమ్మికుంట, రామడుగు మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇప్పటికీ వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించని ప్రభుత్వం గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు 14వ ఆర్థిక సంఘం నిధులే వాడుకోవాలని చెప్పింది. ఆ నిధులు ఎటూ సరిపోక పల్లె జనం గొంతెండుతోంది. కరీంనగర్ నగరంలోనూ పది డివిజన్లలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
నీళ్లకు గోస అయితంది
మంచినీళ్లకు గోస అయితంది. బోరేమో ఎండిపోయింది. పావుగంట కూడా నీళ్లత్తలేవు. నల్లా నీళ్లు సరిపోతలేదు. ట్యాంకర్లతో ఇంటింటికీ నీళ్లు సరఫరా చేయాలే.
రాజమ్మ- ఉప్పరమల్యాల
తాగునీళ్లు కొనుక్కుంటున్నం
తాగునీళ్లు ప్రయివేటు వాటర్ ప్లాంట్ల వద్ద కొనుక్కుంటున్నాం. నల్లా నీరు అవసరాలకు వాడుకుంటున్నాం. వచ్చే అరకొర నీళ్లు కలుషితంగా ఉంటున్నాయి. నల్లానీటిని శుద్ధిచేసి ఎక్కువసేపు వదలాలి.
సరళ- జ్యోతినగర్