Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ విధానాలపై విస్తృత ప్రచారం
- పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న సభలు
- అన్నిపార్టీల్లోనూ ఫ్రంట్పై చర్చలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
వామపక్ష, సామాజిక శక్తుల కలయికతో రాష్ట్రంలో ఏర్పడిన బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రజలతో మమేకమవుతూ, పటిష్టమైన నిర్మాణం ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు నెలల ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకుని, అమలు చేస్తున్నది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీలు వేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈక్రమంలో బీఎల్ఎఫ్ విధానాలను ప్రజల్లోకి తీసుకుపోతున్నది. రాష్ట్రంలో బీఎల్ఎఫ్పై అన్ని పార్టీలూ నజర్ పెట్టాయి. మరోపక్క సర్కారు సైతం ఫ్రంట్ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు నిఘావర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నది.
సామాజిక న్యాయం నినాదంతో బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యంగా నాలుగు నెలల క్రితం ఏర్పడిన బీఎల్ఎఫ్ అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2019 సాధారణ ఎన్నికలకు ఆ ఫ్రంట్ ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నది. దీనిలో భాగంగా బూత్స్థాయి వరకూ నిర్మాణం చేయాలని భావించి, ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహబూబాబాద్ మినహా 16పార్లమెంటరీ నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించి, కమిటీలు పూర్తిచేసింది. ప్రస్తుతం ఆ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కమిటీలూ పూర్తిచేయనున్నారు. ఈనెల 24వరకూ అ సభలు పూర్తి చేయాలని ఆ ఫ్రంట్ నేతలు నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గాల కమిటీలు పూర్తవగానే, మండల, గ్రామ, బూత్ స్థాయి కమిటీలు వేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
రచ్చబండతో ప్రజల్లోకి...
ఒకపక్క భాగస్వామ్య పార్టీలతో బీఎల్ఎఫ్ నిర్మాణం చేసుకుంటూనే, మరోపక్క ప్రజాసమస్యల అధ్యయనంపై ఫ్రంట్ దృష్టిపెట్టింది. 'గ్రామాలకు తరలండి' అనే పేరుతో దళితవాడల్లో, 'తెలంగాణ రచ్చబండ చర్చ' పేరుతో గ్రామాల్లో బీఎల్ఎఫ్ విధానాలను ప్రచారం చేయాలని నిర్ణయించారు. జూన్ మొదటి వారం నుంచి 15 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై అధ్యయన యాత్రలూ కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా గుర్తించిన సమస్యల పరిష్కారానికి జూన్ 25, 26, 27 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేస్తామని ఇప్పటికే ఫ్రంట్ నేతలు ప్రకటించారు. అయితే 119 అసెంబ్లీ, 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ రెండు కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలుగా ఉపయోగపడనున్నాయి. ఒక వేళ ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే, పోటీ చేసేందుకు బీఎల్ఎఫ్ సన్నద్ధమవుతున్నది.
బీసీవర్గాల్లో చర్చ..
రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న బీసీ పట్ల రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. అయితే బీఎల్ఎఫ్ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 60 నుంచి 65 వరకూ సీట్లను బీసీ సామాజిక వర్గాలకు కేటాయిస్తామని ప్రకటించింది. ఇది ఆ సామాజిక వర్గాల్లో పెద్దఎత్తున చర్చకు దారితీసింది. బీఎల్ఎఫ్ మాదిరిగానే అన్ని రాజకీయ పార్టీలు కూడా సగం సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీఎల్ఎఫ్ నిర్ణయం ఇతర రాజకీయ పార్టీల్లోని నేతలనూ కలవరం పెడుతున్నది. ఆయా పార్టీల్లోని బీసీ నేతలు కూడా బీసీలకు సీట్లను పెంచాలని డిమాండ్ను ముందుకు తీసుకొస్తున్నారు.
సర్కార్ నజర్...
ప్రజావ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం సాగిస్తున్న బీఎల్ఎఫ్పై అధికార, ప్రతిపక్షాలు ఓ నజర్ వేశాయి. ఫ్రంట్ చేస్తున్న డిమాండ్లు, విధానాలనే కొన్ని పార్టీలు వారి డిమాండ్లుగా తెరమీదికి తీసుకొస్తున్నాయి. ఇటీవల ఏర్పడిన రెండు పార్టీలు బీఎల్ఎఫ్లో భాగస్వామ్యం కావాలనే ఆలోచన కూడా చేస్తున్నాయనే ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో పక్క తెలంగాణ ప్రభుత్వం కూడా బీఎల్ఎఫ్ కార్యక్ర మాలపై దృష్టిపెట్టింది. ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేందుకు ప్రత్యేకంగా ముగ్గురు పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టు తెలిసింది. బీఎల్ఎఫ్ ఏర్పాటుపై మేధావులు, విద్యావేత్తలు స్వాగతి స్తుండటం ఫ్రంట్కు మరింత బలంగా మరింది.