Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూములప్పగించనందుకు చెక్కులివ్వని వైనం
- అన్యాయమంటున్న బాధిత రైతులు
నవతెలంగాణ-సంగారెడ్డి ప్రతినిధి
తమకు సరైన న్యాయం చేస్తేగానీ భూములివ్వబోమంటూ పోరాడుతున్న మల్లన్నసాగర్ రైతులకు రాష్ట్ర సర్కారు రైతుబందు నిరాకరించింది. ఆ గ్రామాల్లో భూ ప్రక్షాళనను నిలిపేసింది. ముంపునకు గురికాని భూములకూ ఆపేసింది. ఆర్డీఓకు దీనిపై మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. పెట్టుబడి చెక్కులతో రైతుల కండ్లల్లో ఆనందాన్ని చూస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం...మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల్లో మాత్రం కన్నీళ్లను ఒలికిస్తున్నది.
సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టును ప్రభుత్వం 51టీఎంసీలతో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి 14గ్రామాల్లో సుమారు 11వేల ఎకరాలు సేకరించింది. ఇక మిగిలింది వేములఘాట్ గ్రామం. వీరంతా 2013 చట్టం ప్రకారమైతేనే భూములిస్తామని జీవోలు వద్దని 714 రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఇది ఏమాత్రం మింగుడు పడని సర్కార్ అనేక రకాలుగా వారిని ప్రలోభాలకు గురిచేసింది. అయినా, వేములఘూట్తో పాటు తిప్పారం గ్రామ పంచాయతీ పరిధిలోని సింగారం, కిష్టాపూర్, పల్లెపహాడ్, తొగుట గ్రామాల్లో 683 మంది రైతులు ప్రాజెక్టుకు భూములప్పజెప్పకుండా పోరాడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన చేయలేదు. రాష్ట్రమంతా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పాసుపుస్తకాలు ఇక్కడ ఒక్కరి దరికూడా చేరలేదు. భూ యజమానులుగా ఉండటంతో పాటు
ఖాస్తు కూడా చేస్తున్నామని, ఇంతకంటే రైతుబంధు చెక్కు తీసుకోవడానికి కావాల్సిన అర్హత ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఒక్క వేములఘాట్ గ్రామంలోనే 1460 ఖాతాలున్నాయి. గ్రామ పరిధిలో 3,519 ఎకరాల భూమి ఉండగా, ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంకా 995 ఎకరాలను మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ గ్రామంలో 400మందికిపైగా రైతులు సొంత పట్టా పాసు పుస్తకాలు కలిగి ఉన్నారు. తమకు
రైతుబంధు చెక్కులందించాలని వేములఘాట్ నుంచి160 మంది రైతులు (వీరి చేతుల్లో 1200 ఎకరాల భూమి ఉంది), కిష్టాపూర్కు చెందిన 16 మంది(56 ఎకరాలు) పల్లెపహాడ్కు చెందిన ఓ రైతు(మూడెకరాలు) మార్చి 31న ఆర్డీఓకు వినతిపత్రమిచ్చారు. ఇప్పటివరకు అధికారుల నుంచి స్పందన లేదు. వేములఘట్ గ్రామ వాగు పక్కన 50 మంది రైతులు 150 ఎకరాలను సాగు చేసుకుంటున్నారు. వీరి భూమితో ప్రభుత్వానికి ఎలాంటి తగాదా లేదు. వారికీ చెక్కులందించలేదు. రైతుబంధు చెక్కులపై ఆ గ్రామాల రైతులు ప్రశ్నిస్తుంటే అధికారులు మాత్రం తప్పించుకు తిరుగుతున్నారు. 'తాత ముత్తాతల నుంచి సాగుచేసుకుంటున్నం. ప్రభుత్వానికి మేం రైతులుగా కనబడటం లేదా? రాష్ట్రమంతా ఓ న్యాయం? మాకో న్యాయమా?' అని వారు ప్రశ్నిస్తున్నారు.
మాకు ఎందుకివ్వట్లేదో సీఎం చెప్పాలి : లక్ష్మి, కిష్టాపూర్
మా మామకు ముగ్గురు కొడుకు. మా పెనిమిటి చనిపోయిండు. భూమి పంచుకుంటే తలా నాలుగెకరాలొచ్చింది. భూమిని ప్రాజెక్టు కోసం ఇవ్వాలని అధికారులు చెప్పిరు. కానీ, ఇవ్వకుండా పోరాటం చేస్తున్నా. కాస్తులో మా పేరున్నా, పట్టా పుస్తకాలున్నా రైతుబంధు పథకం కింద చెక్కులివ్వడం లేదు. భూమినే నమ్ముకున్న బతుకుతున్న మాకు చెక్కులెందుకివ్వడం లేదు.
మా భూమే పోదు...అయినా ఇస్తలేరు
- నాయిని లింగారెడ్డి, రైతు, వేములఘాట్
మాకు వాగు పక్కనే ఆరెకరాలుంది. అందులో రెండు బోర్లు వేసుకుని 20 ఏండ్ల సంది సాగు చేసుకుంటున్నం. మా భూమి ప్రాజెక్టులో కలుస్తలేదు. రేపు ప్రాజెక్టు వచ్చినా మా భూమి మునగదు. అయినా మాకు చెక్కులిస్తలేరు. అంటే మా మీద సర్కారు కక్ష గట్టినట్టే కదా!
మేం రైతుల లెక్క కన్పిస్తలేమా?
- కాస అంజయ్య, రైతు
నా పేర నాలుగెకరాలుంది. ప్రాజెక్టు కోసం నేను సంతకాలు చేయలేదు. పహానీల్లో, రెవెన్యూ రికార్డుల్లో నా పేరు మీదనే భూముంది. అయినా ప్రభుత్వానికి రైతుగా కన్పిస్తలేనట్టుంది.
మా సొంత భూమికియ్యలే
- పోరెడ్డి మీనయ్య, రైతు, వేములఘట్
పదేండ్ల కింద అప్పు జేసి వాగు పక్కన నాలుగెకరాల 16 గుంటల భూమి కొన్నా. మా కుటుంబానికి గదే జీవనాధారం. ఇప్పుడు మా కొడుకులు చేసుకుంటుర్రు. రికార్డుల్లో వారి పేర్లున్నా రైతుబంధు చెక్కులిస్తలేరు.