Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్కు అధికారమిస్తే ఉచిత విద్య, వైద్యం అందిస్తాం
- కేరళ తరహాలో మద్దతు ధర
- బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-ఇబ్రహీంపట్నం
బీఎల్ఎఫ్ ఆవశ్యకతను చెప్పేందుకు 'పల్లెకు పోదాం' కార్యక్రమం ద్వారా గ్రామాల్లోకి జూన్ మూడో తేదీ నుంచి వెళ్తున్నట్టు ఫ్రంట్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం చెప్పారు. 2019లో బీఎల్ఎఫ్కు అధికారం ఇస్తే ఉచిత విద్య, వైద్య సౌకర్యాలను కల్పిస్తామని, వ్యవసాయానికి భరోసా కల్పిస్తామని హామీనిచ్చారు. పలు జిల్లాల్లో బీఎల్ఎఫ్ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఆదివారం జరిగాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తమ్మినేని మాట్లాడుతూ.. వ్యవసాయరంగంలో సమూల మార్పులు రావాలంటే మార్కెట్లో మధ్య దళారులను నివారించాల్సిన అవసరముం దన్నారు. రైతులకు కేరళ తరహా మద్దతు ధర కల్పిస్తామన్నారు. వ్యక్తులు, పార్టీలు మారితే లాభం లేదని, పాలించే పద్ధతి మారాలని ఆకాంక్షించారు. అది బీఎల్ఎఫ్ చేసి చూపిస్తుందని చెప్పారు. 15ఎకరాలు దాటిన వారికి పెట్టుబడిసాయం అవసరం లేదన్నారు. 813ఎకరాలున్న ఓ భూస్వామికి రూ.32లక్షలు ఇస్తున్నారని, ఆయనకు పెట్టుబడిసాయం ఎందుకని ప్రశ్నించారు. కౌలు, పోడు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తాము అధికారంలోకి వస్తే ప్రయివేటు పాఠశాలలు, కళాశాలలను ప్రభుత్వరంగంలో కలిపేస్తామన్నారు. ఈ కార్యక్రమలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఆశయ్య, చెరుపల్లి సీతారాములు, భూపాల్, యాదయ్య, సామెల్, మధుసూన్రెడ్డి, కె.జగన్, మస్కు నర్సింహ, నర్సింహ, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వనపర్తిలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు జాన్వెస్లీ, పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ ప్రొఫెసర్ వెంకట్దాస్ మాట్లాడుతూ... విద్య, వైద్యం అందుబాటులో ఉన్నప్పుడే వెనుకబడిన వారు సామాజికంగా అభివృద్ధి చెందుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు నాగయ్య మాట్లాడుతూ...రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం మన ఓట్లను మనమే వేసుకొని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)ను గెలిపించుకుందామన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేసి కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై పోరాటాలు చేసే ధర్నా చౌక్నే ఎత్తివేశారని వాపోయారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం గురించి అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నా బీసీలకు 65 అసెంబ్లీ సీట్లు ఇచ్చేందుకు పోరాడాలన్నారు. ఆయన వెంట వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ సాయిని నరేందర్ ఉన్నారు. వికారాబాద్లో పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి మల్లేశం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో బీఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు కన్వీనర్ బి.వెంకట్, జంగారెడ్డి మాట్లాడుతూ... కర్ణాటకలో బీజేపీ అడ్డదారిన అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేసిందన్నారు. రైతులపై కపట ప్రేమ చూపుతున్న కేసీఆర్ గద్దెదిగే రోజులు దగ్గరపడ్డాయన్నారు. చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి సాధు సత్యానంద్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బహుజనులదే రాజ్యాధికారమన్నారు. బహుజనుల అభ్యున్నతి కోసం పుట్టిన పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, రమేష్, తెలంగాణ లోక్సత్తా పార్టీ అధ్యక్షులు వెంకటరాములు, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, సీపీఐ(ఎం) వికారాబాద్ జిల్లా కార్యదర్శి మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.