Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రమే కులం గుర్తింపు
- కులాలను విడగొడుతున్న ప్రభుత్వాలు, పార్టీలు : ప్రొఫెసర్ తిరుమలి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగంలో దృష్టిలో ''కులం'' అనేది లేదని, ఓట్లు, సీట్ల కోసమే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు కులాలను విడగొడుతున్నాయని ప్రొఫెసర్ తిరుమలి అన్నారు. దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే రాజ్యాంగం కులాలుగా గుర్తించిందన్నారు. ఈ కులాలు కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కుల గురించి న్యాయ పోరాటాలు చేయాలే తప్ప.. కులం పేరుతో రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసే హక్కులేదన్నారు.శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్ వినయకుమార్ అధ్యక్షతన ''రాజ్యాంగం దృష్టిలో కులం'' అనే అంశంపై ఆయన ఉపన్యసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 340, 341, 342 ప్రకారం దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను మాత్రమే కులాలు గుర్తించారని తెలిపారు. ఈ కులాలకు మాత్రమే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇస్తారని, ఇతర కులాలకు కుల సర్టిఫికెట్లు ఇచ్చే అధికారం ఎవరికి లేదని చెప్పారు. అలా ఇచ్చినా అది రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి రిజర్వేషన్లు అమలు చేయడం కూడా సాధ్యం కాదని వెల్లడించారు. కులం, రిజర్వేషన్ల గురించి రాజ్యాంగంలో స్పష్టంగా పొందు పర్చారని, దాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. దేశంలో సామాజిక న్యాయం లభించనంతవరకు రిజర్వేషన్లు ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని అభివృద్ధి పర్చేందుకే స్వాతంత్య్రం వచ్చిందని, కులాల కుమ్ములాట కోసం దేశానికి స్వాతంత్య్రం రాలేదన్నారు. కుల రహిత భారతావణి ఏర్పాడాలని ఆకాంక్షించారు.
బ్రాహ్మణ కార్పొరేషన్ అర్థరహితం
దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు మినహా ఇతర కులాలు లేవని, అలాంట ప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఎలా అందజేస్తారని ప్రొఫెసర్ తిరుమలి ప్రశ్నించారు. కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందా లంటే లబ్దిదారుడు బ్రాహ్మణ కులం అన్న సర్టిఫికెట్ జత చేయాలన్న నిబంధన పెట్టారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ''బ్రాహ్మణుడు'' అన్న సర్టిఫికెట్ను ప్రభుత్వం ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రధాన రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కులాలను ఈ విధంగా విడగొడుతున్నాయని విమర్శించారు. ఈ చర్చలో కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్ బాబు పాల్గొన్నారు.