Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘాల ఉమ్మడి పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కౌలు, పోడు, సాదాబైనామాల రైతులతోపాటు వాస్తవ సాగుదారులందరికీ 'పెట్టుబడి పథకం' వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ 31న రోడ్ల దిగ్బంధం కార్యక్రమానికి రైతు సంఘాలు ఉమ్మడిగా పిలుపునిచ్చాయి. ఈ మేరకు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గోడపత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ వాస్తవ సాగుదారులను పక్కన పెట్టి పట్టా ఉన్నవారికే పథకం వర్తింపజేయడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.4వేలతో రైతుల సమస్యలన్నీ పరిష్కారం కావని గుర్తు చేశారు. రైతులు పండించిన పంటకు మద్ధతు ధర కల్పించినప్పుడే న్యాయం జరుగుతుందని చెప్పారు. రోడ్ల దిగ్భంధం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదరి ్శ పశ్యపద్మ మాట్లాడుతూ ఖమ్మం, భద్రాది నుండి కరీంనగర్ వరకు రోడ్డు దిగ్భంధం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్ధతు ప్రకటించి విజయవంతం చేయాలని కోరారు. రైతు స్వరాజ్య వేదిక నేత విస్సా కిరణ్కుమార్ మాట్లాడుతూ 2011 చట్టం ప్రకారం కౌలు రైతులందరికీ గుర్తింపు కార్జులు జారీ చేసి, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలకు రూ.6లక్షలు అందడం లేదన్నారు. ప్రధాన పంటలకు కనీస మద్ధతు దరలపై బోనస్ ప్రకటించాలన్నారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని, వ్యవసాయ భూములను పరిశ్రమలకు తీసుకోవడం వెంటనే ఆపేయాలని అన్నారు. తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర కార్యదర్శి సాయన్న మాట్లాడుతూ పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడి నాలుగేండ్లు అయినా రైతులకు న్యాయం చేయలేదని విమర్శించారు.ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వర్రావు, భూతం వీరన్న తదితరులు పాల్గొన్నారు.