Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంఆర్ఎఫ్ చెక్కు కోసం డబ్బులడిగిన మార్కెట్ కమిటీ డైరెక్టర్
- తండ్రి కొడుకులతో కలిసి కర్రలు, రాళ్లతో కొట్టిన వైనం
- సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో ఘటన
నవతెలంగాణ-కోహెడ
సీఎం సహాయనిధి చెక్కు కోసం లంచం ఇవ్వలేదని దళితునిపై పెత్తందార్లు దాడి చేశారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లిలో శుక్రవారం జరిగింది. బాధితుని వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాగుల సతీష్ కుమారుడు అనారోగ్యానికి గురవడంతో ఆర్నెల్ల క్రితం సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవలే రూ.31 వేల చెక్కు వచ్చింది. ఆ చెక్కు గ్రామానికి చెందిన మార్కెట్ కమిటీ డైరెక్టర్ మ్యాకల రజనీకాంత్రెడ్డి వద్ద ఉంది. దీంతో ఆయన ఫోన్ చేసి సతీష్ను చెక్కు తీసుకోవాలని చెప్పాడు. అందుకు రూ. 5వేలు లంచం ఇవ్వాలని అడిగాడు. బాధితుడు ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేసి సమాచారమందించాడు. స్పందించిన పీఏ వెంటనే ఆ చెక్కు అందజేయా లంటూ సూచించాడు. గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి సర్పంచ్, వీఆర్ఏ ద్వారా చెక్కు తీసుకోవాలని సమాచారమివ్వడంతో సతీష్ అక్కడికి వెళ్లాడు. ఎమ్మెల్యే పీఏకు తనపై ఫిర్యాదు చేయడం, డబ్బులు కూడా ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన రజనీకాంత్రెడ్డి, అతని సోదరులు మ్యాకల చంద్రశేఖర్రెడ్డి, మ్యాకల సురేందర్రెడ్డిలతో వారి తండ్రి మ్యాకల మోహన్రెడ్డిలు సతీష్పై కర్రలు, రాళ్ళతో దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో దళితుడిపై అగ్రవర్ణాల దాడిని నిరసిస్తూ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ సంఘం నాయకులు, మాజీ సర్పంచ్ బస్వ రాజు శంకర్ నిరసన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని, అధికారుల ద్వారా చెక్కు అందించకుండా టీఆర్ఎస్ కార్యకర్తలకు చెక్కు అందజేసిన ఎంపీడీఓను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.