Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దోషులను శిక్షించాలి : తెలంగాణ ప్రజాస్వామిక వేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంద్రావతి నది ఒడ్డున జరిగిన ఆదివాసీల హత్యాకాండకు నిరసనగా ఈ నెల 28న కలెక్టరేట్ల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నాయకులు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఇంద్రావతి నది ఒడ్డున జరిగిందని చెప్పబడుతున్న ఎదురుకాల్పుల సంఘటనలో మరణించిన వారి సంఖ్య 42కు చేరిందన్నారు. అందులో మావోయిస్టులు ఎంతమంది? ఆదివాసీలు ఎంత మంది ఉన్నారనే సంగతిని ఇంతవరకు గుర్తించలేదని చెప్పారు. 8 మందిని మాత్రమే గుర్తించి శవాలను అప్పగించారని అన్నారు. విరసం నాయకులు వరవరరావు మాట్లాడుతూ దేశమూలవాసులైన ఆదివాసీలు నివసిస్తున్న జీలం, గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, ప్రాణహిత వంటి నదుల పరివాహక ప్రాంతాలన్నీ స్థానిక పోలీసులు, పారామిలటరీ బలగాలతో నిండి ఉందన్నారు. ప్రజల ప్రాణాలను గడ్డిపోచకంటే తేలికగా భావిస్తూ అమానుషంగా వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలోని కసన్సూర్లో జరిగిన హత్యాకాండ అమానుషమన్నారు. దోషులను శిక్షించే వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందన్నారు. ఆత్మరక్షణకు కాల్పులు జరిపామని చెప్పడం కట్టుకథ అని ఆరోపించారు. పోలీసులు తుపాకులతోపాటు యుద్ధంలో వాడే యుబిజిఎల్ ఉపయోగించామని, ఈ వి
షయాన్ని పోలీసులే చెప్పారని అన్నారు.ఎదురు కాల్పుల పేరు మీద మనుషులను చంపే అధికారం పోలీసులకు లేదన్నారు. పిఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ మధ్యభారతంలో మొత్తం యుద్ధవాతావరణం నెలకొందన్నారు. బహుళజాతి కంపెనీలకు భూములు కట్టబెట్టడానికే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. నిరసన, ఆందోళన, ఆవేదన, సమావేశాలు నిర్వహించుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.. సామాజికవేత్త ఉ. సాంబశివరావు మాట్లాడుతూ దేశ:లో ప్రజాస్వామ్య వాతావరణం లేకుండా పోయిందన్నారు. ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు దోషుల మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల బహుజనులు 28న ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో వేదిక నేతలు డా. సుధాకర్, సూరేపల్లి సుజాత, కోట శ్రీనివాస్, నారాయణరావు, సదానందం, ఉపేందర్, రాజు తదితరులు పాల్గొన్నారు.