Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతినిధులను అడ్డుకున్న గ్రామస్తులు
నవతెలంగాణ - పెద్దపల్లి రూరల్
'ఈడ కంపెనీ పెట్టొద్దు.. సర్పంచి, వార్డు సభ్యులు లంచం తీస్కొని సంతకాలు పెట్టిండ్రు..మా బతుకుల్ల మన్ను పోస్తరా' అంటూ పెద్దపల్లి జిల్లా రాగినేడులో సోలార్ కంపెనీ ప్రతినిధులను గ్రామస్తులు అడ్డుకున్నారు. సోలార్ ప్లాంట్ నిర్మాణం కోసం పరిశీలించేందుకు కంపెనీ ప్రతినిధులు శుక్రవారం గ్రామానికి రాగా, వారు అడ్డుకున్నారు. నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని రెండు గంటలపాటు ఆందోళన చేశారు. పెద్దపల్లి పోలీసులు అక్కడికి వచ్చి వారికి నచ్చజెప్పారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. సోలార్ ప్లాంట్ కోసం 32 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. సోలార్ కంపెనీ పెడితే గ్రామం పూర్తిగా రోగాల బారిన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా, కనీసం గ్రామసభ పెట్టకుండా సర్పంచ్ భర్త, వార్డు సభ్యులు లంచాలు తీసుకుని అనుమతులపై సంతకాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ ప్రతినిధులు కొనుగోలు చేసిన భూములను తిరిగి అప్పగించి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కల్పించుకుని చర్చలు జరిపాకే పనులు ప్రారంభించాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. అందుకు వారు సరేననడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.