Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాన్స్ఫార్మర్ పట్టుకుని ఒకరు బలవన్మరణం
- ఇద్దరు పురుగుల మందు తాగి..
నవతెలంగాణ- సిద్దిపేటకలెక్టరేట్ (నంగునూరు)/ వర్ని / భీంపూర్
పంట దిగుబడి సరిగ్గా రాక.. అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురై శుక్రవారం ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకరు బలవంతంగా ట్రాన్స్ఫార్మర్ను పట్టుకోగా.. మరో ఇద్దరు అన్నదాతలు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కొండంరాజుపల్లి గ్రామానికి చెందిన సుంకరి కనకయ్య (65)కు రెండెకరాల పొలం ఉంది. గ్రామంలో ఉపాధి కరువై పదేండ్ల కిందట జీవనోపాధి కోసం దుబాయి వెళ్లాడు. ఐదేండ్ల కిందట సొంత గ్రామనికి తిరిగొచ్చి తనకున్న రెండెకరాలతో పాటు ఖాతా గ్రామానికి చెందిన కాసార్ల ఇంద్రసేనారెడ్డికి చెందిన నాలుగెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. కానీ పంట ఆశించినంత రాలేదు. అదే సమయంలో కూతురి పెండ్లి కోసం రూ. లక్ష అప్పు, పెట్టుబడులకు రూ.లక్ష అప్పు చేశాడు. చివరకు వాటిని తీర్చేమార్గం లేక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం బావి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పట్టుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడికి నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఘటనా స్థలాన్ని తహశీల్దార్ విజరుభాస్కర్జీ, ఆర్ఐ బాలరాజు సందర్శించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తులో ఉంది.
నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మేడిపల్లి తండాకు చెందిన లకావత్ ప్రేమ్దాస్ (27) తన ఐదెకరాల వ్యవసాయ భూమిలో అప్పులు చేసి రెండుసార్లు బోర్లు వేయించినా చుక్క నీరురాలేదు. సుమారు రూ.3లక్షల బాకీలు కావడంతో ఇంట్లో తరచూ గొడవలయ్యాయి. ప్రత్యామ్నాయ మార్గం లేక ఇంట్లోనే మధ్యాహ్నం పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబీకులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ప్రయివేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మతునికి భార్య రజిత, కొడుకు, కూతురు ఉన్నారు. మృతుని తండ్రి వెంకట్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వర్ని ఎస్ఐ సాయినాథ్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటి గ్రామానికి చెందిన రైతు దాసరి సుదర్శన్ (55) తనకున్న నాలుగెకరాలతో పాటు తన తల్లికి చెందిన మరో రెండెకరాల్లో పత్తి సాగు చేశాడు. గులాబీ పురుగు సోకడంతో దిగుబడి తగ్గింది. పంట కోసం చేసిన బాకీలు రూ.5.20 లక్షలు ఎలా తీర్చాలన్న మనోవేదనతో బుధవారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించగా శుక్రవారం ఉదయం పరిస్థితి విషమించి మరణించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై లింగన్న తెలిపారు.