Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనగామను భద్రాద్రి జోన్లో కలపాలి
- చార్మినార్లో వికారాబాద్, జోగులాంబలో రంగారెడ్డి ఉండాలి
- సీఎస్కు ఉద్యోగ జేఏసీ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో జోనల్ విధానం రూపొందించడం, 31 జిల్లాలను ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ ఉద్యోగ జేఏసీ హర్షం ప్రకటించింది. కేసీఆర్ ఆదేశాల మేరకు శుక్రవారం టీజీవో భవన్లో ఉద్యోగ జేఏసీ నేతలు బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మెన్ దేవీప్రసాదరావు, ఎమ్మెల్యే వి శ్రీనివాస్గౌడ్, ఉద్యోగ జేఏసీ చైర్మెన్ కారం రవీందర్రెడ్డి, సెక్రెటరీ జనరల్ వి మమత నేతృత్వంలో సమావేశమయ్యారు. అనేక అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఏకగ్రీవంగా చేసిన తీర్మానాలను ప్రకటన రూపంలో విడుదల చేశారు. నాలుగో జోన్గా ప్రకటించిన భద్రాద్రిని భద్రాద్రి-కాకతీయగా మార్చాలని కోరారు. జనగామ జిల్లాను యాదాద్రి జోన్ నుంచి భద్రాద్రి జోన్లో కలపాలని సతూచించారు. జోగులాంబలో ఉన్న వికారాబాద్ జిల్లాను చార్మినార్లో కలపాలని తెలిపారు. చార్మినార్లో ఉన్న రంగారెడ్డి జిల్లాను జోగులాంబలో కలపాలని కోరారు. అన్ని క్యాడర్ల ఉద్యోగాలను నేరుగా భర్తీ చేసే వాటికి 85 శాతం స్థానికులకు, 15 శాతం ఓపెన్ మెరిట్ ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించామని సూచించారు. జిల్లా నుంచి హెచ్వోడీ, సచివాలయంకు బదిలీ కావాలంటే జోనల్ విధానంలో ఉండే ఫేర్షేర్ను వర్తింపచేయాలని కోరారు. ఉద్యోగాల భర్తీకి నాలుగు క్యాడర్ల విధానం అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో జిల్లా, జోనల్, మల్టీజోనల్, రాష్ట్రస్థాయి క్యాడర్లుండాలని కోరారు. తెలంగాణ స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలొచ్చేలా ఉండాలని తెలిపారు. హెచ్వోడీ, సచివాలయం, రాష్ట్రస్థాయి క్యాడర్ పోస్టులు మినహా మిగిలినవి మల్టీజోనల్గా పరిగణించి యువతకు అవకాశాలు కల్పించాలని సూచించారు. శాఖలవారీగా ప్రత్యేకంగా ప్రతిపాదనలు సమర్పిస్తామని తెలిపారు. సీఎస్ను కలిసిన వారిలో టీఎన్జీవో నేతలు ఎం రాజేందర్, ఉపేందర్రెడ్డి, రేచల్, టీజీవో నేతలు సత్యనారాయణ, కృష్ణయాదవ్, లక్ష్మినారాయణ, తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి, ఇంటర్ విద్యాజేఏసీ చైర్మెన్ పి మధుసూదన్రెడ్డి, టీటీయూ అధ్యక్షుడు మణిపాల్రెడ్డి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శివశంకర్ తదితరులున్నారు.