Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్మశానవాటిక స్థలం కాజేసేందుకు వీడీసీ కుట్ర
- ప్రభుత్వ ఉదాసీనత వల్లే వీడీసీల ఆగడాలు : సీపీఐ(ఎం)
నవతెలంగాణ-ఆర్మూర్
దళితుల శ్మశాన వాటిక స్థలాన్ని కాజేసేందుకు, బుద్ధుడి విగ్రహం తొలగింపునకు వీడీసీ కుట్ర పన్నింది. అందుకు తలొగ్గకపోవడంతో 15 రోజుల కిందట దళితులను బహిష్కరించింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూరులో సామాజిక బహిష్కరణకు గురైన 212 దళిత కుటుంబాలు శుక్రవారం ఏసీపీకి ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.
ఆర్మూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వరకు బాధితులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్శంగా వారు వివరాలు వెల్లడించారు. గ్రామంలోని గుప్తా రోడ్డుకు సమీపంలో సర్వేనెంబర్ 1244లోని ఎకరా 7 గుంటల స్థలంలో దళితుల శ్మశానవాటిక ఉంది. అది ప్రభుత్వ స్థలమని, అందులో వ్యవసాయశాఖ కార్యాలయ నిర్మాణం చేపట్టాలని వీడీసీ పలుమార్లు యత్నించింది. రెవెన్యూ సిబ్బంది సాయంతోనూ దళితులను వేధించింది. మూడు నెలలుగా ఈ వివాదం కొనసాగుతోంది. దళితులు వెనక్కి తగ్గకపోవడంతో 15 రోజుల కిందట వీడీసీ సామాజిక బహిష్కరణ చేసింది. దీంతో వీడీసీ అధ్యక్షులు కుంటు శేఖర్, ఉపాధ్యక్షులు మహేందర్, నాయకులు గంగాధర్, బుస్సాపురం గంగారెడ్డిపై బాధితులు శుక్రవారం ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తమ శ్మశానవాటిక స్థలాన్ని లాక్కొనేందుకు, బుద్ధవిగ్రహం తొలగించేందుకు తమను లొంగదీసుకోవాలనే సామాజిక బహిష్కరణ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో దళిత సంఘం నాయకులు గోవింద్పేట్ సర్పంచ్ ప్రభాకర్, డీఎస్ఎఫ్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షుడు సుధాకర్లతో పాటు బాధితులు లక్ష్మీ, గంగామణి, సుభాష్, క్రాంతి, రాజన్న,
బాబురావు, బాధితులు ఉన్నారు.
ప్రభుత్వ ఉదాసీనతోనే వీడీసీల ఆగడాలు
రమేష్బాబు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి - నిజామాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీడీసీల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. అందుకు అధికారుల ఉదాసీన వైఖరి కూడా కారణం. ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సమాంతర పాలన కొనసాగిస్తున్న గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలి. అలూరు దళితులను బహిష్కరించిన వీడీసీ సభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
వీడీసీ దౌర్జన్యాలను అరికట్టాలి
వందేండ్ల నుంచి దళితుల శ్మశానవాటికగా కొనసాగుతున్న స్థలాన్ని వీడీసీ దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తోంది. గ్రామంలో వందల ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకొని ఆ స్థలంలో వ్యవసాయ కార్యాలయాన్ని నిర్మించుకోవాలి. వీడీసీని రద్దు చేసి దళితులకు న్యాయం చేయాలి.
- ప్రభాకర్, దళిత సంఘం నాయకులు