Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మక్క విత్తనాల్లో బహుళజాతి కంపెనీల మాయాజాలం
- కొనుగోలు ధర రూ. 1,600.. అమ్మకం ధర 35,000
- రాష్ట్రంలో 2,800 కోట్ల వ్యాపారం
* కొండూరి రమేశ్బాబు
ఒక వైపు ఖరీఫ్ కాలం సమీపిస్తుంటే బహుళజాతి, కార్పొరేట్ సంస్థలు మక్క విత్తుల వ్యాపారానికి తెర లేపాయి. విత్తనాల కోసం పండించే మక్కలకు నామమాత్రపు ధర చెల్లిస్తున్న ప్రముఖ కంపెనీలు అవే విత్తనాలను శుద్ధి చేసి అధిక ధరలకు విక్రయించటం ద్వారా రూ. కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నాయి. రాష్ట్రంలో పండించే ప్రధాన పంటల్లో మక్క కూడా ఒకటి కాగా ఖరీఫ్ రబీలో కలిపి 16 లక్షల ఎకరాల్లో ఈ పంటను పండిస్తారు. విత్తనాల ధరల విషయంలో ప్రభుత్వ ఉదాసీనత కారణంగా కంపెనీలు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని రైతులు విమర్శిస్తున్నారు. ఎకరానికి ఐదు కిలోల మక్క విత్తనాలు అవసరం కాగా మార్కెట్లో
విత్తుకు మస్కా రిటైల్ ధరలు రైతులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో మక్క విత్తనాలను కంపెనీలు సగటున రూ. 350 కి విక్రయిస్తున్నాయి. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విత్తనాలనే ఇక్కడ అధిక ధరలకు విక్రయించటం విశేషం. కరీంనగర్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో బహుళజాతి కంపెనీలైన మోన్శాంటో, సింజెంటా, పయోనీర్తో పాటూ కార్పొరేట్ కంపెనీ కావేరి 50 వేల ఎకరాలో మక్కల విత్తనోత్పత్తి చేస్తున్నాయి. ఆహార పంటగా వినియోగించే మక్కలకు క్వింటాలకు రూ. 1,425 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయించగా వాణిజ్య అవసరాలకోసం చేసే విత్తనోత్పత్తి పంటకు కంపెనీలు కేవలం క్వింటాకు రూ. 1,500 నుంచి రూ. 1,600 మాత్రమే చెల్లిస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బహుళజాతి కంపెనీలు విత్తన శుద్ధి కర్మాగారాలను నెలకొల్పిన కంపెనీలు విత్తనాలను శుద్ధిచేసి ప్యాకింగ్ చేసి రాష్ట్రంలో విక్రయించటమే కాక విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. సగటున ఒక కిలోకి రూ. 16 రూపాయలను విత్తన రైతులకు చెల్లిస్తున్న కంపెనీలు శుద్ధి చేసిన తర్వాత కిలో విత్తనాలను రూ. 350కి అమ్మటం ద్వారా వందల కోట్లు గడిస్తున్నాయి. కేవలం రాష్ట్రంలో రూ. 2,800 కోట్ల విలువ చేసే మక్క విత్తనాల వ్యాపారం జరుగుతున్నట్టు అనధికారిక అంచనా ద్వారా తెలుస్తున్నది. ఏ ప్రాంతంలో ఏ కంపెనీ ఎంత మేరకు విత్తనోత్పత్తి చేస్తున్నదో ప్రభుత్వం వద్ద కూడా వివరాలు లేక పోవటం విశేషం. వాణిజ్య అవసరాల కోసం ఉత్తత్తి చేస్తున్న విత్తన మక్కలకు కనీసం క్వింటాకు రూ. 3,500 నుంచి రూ. 4,000 వరకూ చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా బహుళజాతి కంపెనీలతో పాటూ రాష్ట్రానికి చెందిన కార్పొరేట్ కంపెనీ పట్టించుకోవటం లేదు. ప్రముఖ కంపెనీలు విత్తనోత్తత్తి చేస్తున్న ప్రాంతాల్లో ఇతర పంటలకు నష్టం వాటిల్లుతున్నదని, పర్యావరణానికి కూడా తీవ్ర విఘాతం కలుగుతున్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. విత్తనాల కోసం ఉత్పత్తి చేసే మక్క కంకులు తింటే మనుషులకే కాకుండా పశువులకు కూడా ప్రమాదమని తెలిసినా ఈ విషయంపై రైతులకు కంపెనీలు ఎటువంటి అవగాహన కల్పించటం లేదు. కనీసం హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయటం లేదు. తమ కంటి ముందు పండించిన మక్క విత్తనాలపై కంపెనీలు వందల కోట్లు లాభాలను సంపాదిస్తూ తమకు మాత్రం గిట్టుబాటు ధర చెల్లించక పోగా మళ్లీ ఇవే విత్తనాలను అధిక ధరలకు తమకు విక్రయించటాన్ని రైతులు తప్పుపడుతున్నారు. విత్తనోత్పత్తి చేసే కంపెనీలు ఏ ప్రాంతంలో ఎన్ని ఎకరాల్లో వాటిని పండిస్తున్నారో వ్యవసాయ శాఖ వద్ద నమోదు చేయించాల్సి ఉన్నది. అయినప్పటికీ బహుళజాతి, కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ శాఖను పట్టించుకోక పోవటం వెనుక బలమైన లాబీ ఉన్నట్టు తెలుస్తున్నది.
మక్క విత్తనాల రిటైల్ ధరలు
కిలో ఒక్కింటికి రూపాయల్లో
------------------------
కంపెనీ పేరు ధర
------------------------
మోన్శాంటో 350
సింజెంటా 400
కావేరి 320
పయోనీర్ 350
------------------------