Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు 15 నుంచి షురూ
- 18నుంచి 60 ఏండ్ల వారికి వర్తింపు ఏ కారణంతో మరణించినా రూ.5లక్షలు చెల్లింపు
- రైతు మరణించిన పది రోజుల్లో నామినీకి
- ప్రీమియం చెల్లింపు బాధ్యత ప్రభుత్వానిదే
- ఎల్ఐసీతో ఒప్పందం
- రాష్ట్రంలో 93 శాతం సన్నకారు, ఎకరం లోపు వారు 18లక్షలు : బీమా పథకంపై కేసీఆర్ సమీక్ష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం మరో ముందడుగు వేసిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వెల్లడించారు. ఇప్పటికే రైతుబంధు పథకం, ఉచిత విద్యుత్, రైతు సమన్వయ సమితుల్లాంటి అద్వితీయ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం రైతులకు జీవిత బీమా సౌకర్యంతో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రైతులందరికీ జీవిత బీమా పథకం ప్రారంభించి, బీమా సర్టిఫికెట్లు అందజేస్తామని చెప్పారు. రైతులు ఒక్క రూపాయి కూడా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని వెల్లడించారు. బీమా చెల్లించడానికి అయ్యే నిధులను బడ్జెట్లోనే కేటాయించి, ప్రతి సంవత్సరం ఆగస్టు 1న ప్రీమియం డబ్బులను చెల్లిస్తామని తెలిపారు. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్లలోపు వారి పేర్లను నమోదు చేసి 60 ఏండ్ల వయస్సు వరకు బీమా వర్తింస్తుందన్నారు. రైతులకు జీవిత బీమా పథకం రూపకల్పనపై శుక్రవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వ్యవసాయం ఆర్థిక శాఖ అధికారులు, ఎల్ఐసీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకోవడం బాధ్యతగా భావించి జీవిత బీమా చేయాలని నిర్ణయించామన్నారు. రైతు ఏ కారణంతో చేత మరణించాడన్న విషయంతో సంబంధం లేకుండా, సాధారణ మరణాలతో సహా రైతు మరణించిన 10 రోజుల్లో నామినికి రూ.5 లక్షల బీమా చెల్లిస్తామన్నారు. కేవలం ప్రమాద బీమా మాత్రమే అయితే ప్రభుత్వంపై వ్యయభారం కూడా తక్కువయ్యేదని, కానీ ఖర్చుకు వెనకాడకుండా బీమా చేయాలని నిర్ణయించామన్నారు.
రాష్ట్రంలో 93 శాతం సన్న కారు రైతులు ఉండగా, 18 లక్షల మంది ఎకరం పొలం ఉన్నవారు ఉన్నారని సీఎం వెల్లడించారు. ఇంత పెద్ద మొత్తంలో బీమా చేస్తున్నందున ''లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'' (ఎల్ఐసీ) కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.
విధి విధానాలు
ఆధార్ కార్డులో నమోదైన పుట్టిన తేదిని ప్రమాణికంగా తీసుకుంటారు. 2018- ఆగస్టు నాటికి రైతు 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వసయస్సు కలిగి ఉండాలి. ప్రతి ఏడాది ఆగస్టు 15ను ప్రామాణికంగా తీసుకుని పేర్లను నమోదు చేస్తారు. దాని ప్రకారమే ప్రభుత్వం రైతుల జాబితాను రూపొందించి ప్రీమియం చెల్లిస్తుంది.
ప్రతి రైతుకు ప్రభుత్వం- ఎల్ఐసీ సంయుక్తంగా బీమా సర్టిఫికెట్ అందజేస్తారు. బీమా సొమ్ము రూ.5లక్షలు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయాన్ని రైతుకే అవకాశం కల్పిస్తారు. ముందుగానే రైతు నుంచి నామిని ప్రతిపాదించే పత్రం తీసుకుంటారు. దాని ప్రకారమే బీమా సొమ్ము చెల్లిస్తారు. రైతు మరణించిన పది రోజల్లోగా బీమా సొమ్ము చెల్లించకుంటే ఎల్ఐసీకి జరిమాన విధిస్తారు.
ప్రతి నెలా రైతు వివరాలను వ్యవసాయధికారులు అప్డేట్ చేస్తారు. దాని ప్రకారమే బీమా పథకానికి అర్హులయ్యే రైతుల జాబితాకూడా అప్డేట్ అవుతుంది.
వ్యవసాయధికారులు క్లస్టర్ల వారీగా 18 నుంచి 59 వయస్సు గత రైతుల జాబితాను సిద్ధం చేస్తారు. ప్రభుత్వం వారి తరపున ఏకమొత్తంలో ప్రీమియం చెల్లించి
రైతుల జాబితాను ఎల్ఐసీకి అందజేస్తుంది.
దేశ చరిత్రలో రైతు బీమా రికార్డు - ఎల్ఐసీ
దేశ చరిత్రలోనే రైతు బీమా రికార్డు అని, బీమా సంస్థల చరిత్రలో సరికొత్త రికార్డు అని ఎల్ఐసీ రీజినల్ మేనేజర్ ఆర్ చందర్, డివిజనల్ మేనేజర్ బిఎస్ నర్సింహా అన్నారు. గతంలో కూడా ఇలాంటి గ్రూపు ఇన్స్స్యూరెన్స్లు ఉన్నాయని, కానీ అందులో సభ్యులు వేల సంఖ్యలో మాత్రమే ఉన్నారని చెప్పారు. కాని రాష్ట్ర ప్రభుత్వం ఎంత వ్యయానికైన ఓర్చి రైతులందరికీ బీమా చేయడం హర్షణీయమన్నారు.