Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని పదే పదే ప్రకటిస్తున్న ప్రధాన మంత్రి మోడీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరిన్నీ అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ రైతు సంఘం పేర్కొంది. ఇప్పటికే మార్కెట్లో ఉత్పత్తి ధరపై 50 శాతం కలిపి వ్యవసాయ ఉత్పత్తులు ధరలు నిర్ణయించి ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు ప్రచార, ప్రసార సాధనాలలో హోరెత్తి ప్రచారం సాగిస్తున్నారని విమర్శించింది. ఈమేరకు గురువారం రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పి జంగారెడ్డి,టి సాగర్,ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఇ మార్కెట్ ద్వారా రైతులకు లాభం కలుగుతున్నట్టు ప్రకటించారని పేర్కొన్నారు. పంట రుణాలు రూ 11 లక్షల కోట్లకు పెంచినట్టు, గత నాలుగేండ్లలో రూ 2.12 లక్షల కోట్ల బడ్టెట్ కేటాయించినట్టు చెప్పడం సరైందికాదన్నారు. ప్రధాన మంత్రి ప్రకటనలో ఏ ఒక్కటైన వాస్తవంలేదని, ఇలాంటి అవాస్తవ ప్రచారాన్ని ఖండిస్తుందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధరలు అమలుకాక, ఉత్పత్తులు పెరగక, రుణ లభ్యత లేకపోవడంతో రైతులు వ్యవసాయాన్ని వదిలేసి పరిస్థితులు వస్తున్నాయన్నారు. దీనిని అవకాశంగా తీసుకొని 82 శాతంగా ఉన్న సన్న, చిన్నకారు రైతులు ఈ రంగం నుండి తొలగించి వారి భూములతో రైతుల ఉత్పత్తిదారుల ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి కార్పొరేట్లకు అప్పగించడానికి ముసాయిదా బిల్లును రూపొందించి రాష్ట్రాలకు పంపడం జరిగిందన్నారు. బియ్యం లేవి సేకరణ రద్దు చేసి రాష్ట్రాలపై బాధ్యతను తోసివేసిందని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని ప్రకటించడం హాస్యా స్పదమన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి టీవీ పత్రికలు, రేడియో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.