Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మృతి
- తమ చావుకు నలుగురు కారణమని సూసైడ్నోట్ !
- విచారిస్తున్న పోలీసు అధికారులు
- సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఘటన
నవతెలంగాణ- సిద్దిపేట అర్బన్
ఆర్థిక ఇబ్బందులు, నమ్మిన వారి మోసం జర్నలిస్టు కుటుంబాన్ని బలితీసుకున్నాయి. నిద్రలేచింది మొదలు రాత్రి వరకు ప్రజా సమస్యలపై స్పందిస్తూ వార్తలు రాసే విలేకరి తనకు ఎదురైన సమస్యలతో మాత్రం మానసిక స్థైర్యాన్ని కోల్పోయాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ నలుగురి చావులకు నలుగురు కారణమని సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది. సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం..
కొండపాక మండలం వెలికట్ట గ్రామానికి చెందిన హన్మంతరావు(35), మీనా(33) దంపతులు. వారికి మిన్ను(5), భిన్ను(3) కుమార్తెలు. హన్మంతరావు కొన్నేండ్లుగా ఓ పత్రికలో కొండపాక మండల విలేకరిగా పని చేస్తున్నాడు. కుటుంబంతో కలిసి జిల్లా కేంద్రంలోని శ్రీనగర్కాలనీలో నివాసముంటున్నాడు. విలేకరిగా కొనసాగుతూనే, 2014లో కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో 'ఇస్కో కిసాన్ రైతు స్కీం పాన్ కార్డు సెంటర్'ను ప్రారంభించాడు. అక్కడ పని చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన భాస్కర్, కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన గంగుల మమతను నియమించాడు. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే సంవత్సరం కాలంగా మమత, భాస్కర్ కలిసి హన్మంతరావు ఆఫీస్ను కబ్జా చేయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో మమత చాలాసార్లు ఆఫీస్లోని క్యాష్ కౌంటర్లో బలవంతంగా డబ్బులు బలవంతంగా తీసుకుంది. మమత 78 వేలు, భాస్కర్ 75 వేల వరకు తీసుకున్నారు. దాంతో వారిని హన్మంతరావు ఆఫీస్ విడిచి వెళ్లాల్సిందిగా పలుమార్లు హెచ్చరించాడు. అలా అయితే, తనను రేప్ చేశావని కేసు పెడతానని, తనకు చాలా మంది అధికారులు తెలుసు అని మమత హన్మంతరావును బెదిరించేంది. క్యాష్ కౌంటర్కు తాళం వేస్తే బండి తాళంచెవితో తీసి డబ్బులు నొక్కేసేది. ఇదిలా ఉండగా, హన్మంతరావు తన తండ్రి పేరు మీద ఉన్న భూమి రిజిస్ట్రేషన్ కాగితాలను తాకట్టు పెట్టి సిద్దిపేటకు చెందిన కనకయ్య, దుద్దెడకు చెందిన శ్రీనివాస్గౌడ్ వద్ద కొంత డబ్బులు తీసుకున్నాడు. అవి ఎప్పుడిస్తావని వారు ఒత్తిడి పెంచారు. 'డబులు ఇస్తావా? చస్తావా? మీ పిల్లల్ని కిడ్నాప్ చేయాలా?' అని ఇటివల బెదిరించారు కూడా. ఇవన్నింటితో తీవ్ర మనస్తాపానికి గురైన హన్మంతరావు ఈ నలుగురి వల్లే తాము నలుగురం ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్లో మమత, భాస్కర్, కనకయ్య, శ్రీనివాస్ పేర్లను పేర్కొన్నాడు.
బుధవారం రాత్రి ఇంట్లో ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, భార్యాభర్తలు ఉరేసుకున్నారు. స్థానికులు గమనించి వెళ్లేసరికే పిల్లలు, హన్మంతరావు చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న మీనాని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి ఆమె కూడా గురువారం రాత్రి చనిపోయింది. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.