Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిడుగుపాటుకు ఇద్దరు మృతిొచెరువును తలపించిన మెదక్ కలెక్టరేట్
నవతెలంగాణ-యంత్రాంగం
రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పిడుగులు పడి ఇద్దరు మృతిచెందారు. మెదక్లో భారీ వర్షం కురిసింది. కలెక్టరేట్ ప్రాంగణం చెరువును తలపించింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం శానగొండకు చెందిన రాజేశ్వరి(46) దినసరి కూలీ. గురువారం నాడు చంద్రయ్య పత్తిచేనులో కలుపు తీసేందుకు వెళ్లింది. చేనులో పని చేస్తుండగా మధ్యాహ్నం ఉరుములు, పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలోనే రాజేశ్వరిపై పిడుగు పడింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రాజేశ్వరికి ఇద్దరు ఆడపిల్లలుండగా ఇటీవలే వారికి పెండ్లి జరిగింది. భర్త సారంగపాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ కిరణ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్టు చెప్పారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహదేవ్పూర్ మండలానికి చెందిన శ్రీరాముల సమ్మయ్య(50) మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామంలో పెండ్లికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వచ్చే క్రమంలో వర్షం మొదలైంది. దీంతో అతను రాపనపల్లి అటవీ ప్రాంతంలో ఓ చెట్టు కింద ఆగాడు. ఈ క్రమంలోనే అతనిపై పిడుగు పడి అక్కడికక్కడే మరణించాడు.
పెద్దపల్లి మండలం నిట్టూర్ గ్రామంలో రాజేశ్వరరావుకు చెందిన గడ్డివాము తగులబడిపోయింది. అప్రమత్తమైన స్థానికులు పెద్దపల్లి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్ మంటలను అదుపులోకి తెచ్చింది. పెద్దపల్లి ఏసీపీ హబీబ్ఖాన్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో బుధవారం రాత్రి బలమైన ఈదురుగాలులు వీయడంతో రైలుమిల్లు ప్రహరీ కూలింది. దాదాపు రూ.2లక్షల నష్టం వాటిల్లింది.
మెదక్ జిల్లా కేంద్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. కరెంట్ అంతరాయంతో వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. మెదక్ కలెక్టరేట్ ప్రాంగణం చెరువును తలపించేలా నిండిపోయింది. హవేళిఘనపూర్ కూచన్పల్లిలో పిడుగుపాటుకు గేదె మృత్యువాత పడింది. సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలంలో భారీగా వర్షం కురిసింది. గజ్వేల్, ప్రజ్ఞాపూర్, తొగుట, తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.