Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిలీ పట్టా పాసుపుస్తకాలతో.. రూ.1.53లక్షల మేర మాయం
- టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల హస్తం!
రైతుబంధు పథకం చెక్కులు స్వాహా చేశారు. నకిలీ పట్టా పాసుపుస్తకాలు తయారు చేసి రూ.1.53లక్షలకు పైగా కాజేశారు. దీని వెనుక కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల హస్తం ఉన్నట్టు ఆరోపణలొస్తున్నాయి. రైతుల ఆందోళనతో వెలుగుచూడటంతో తహసీల్దార్ గ్రామానికెళ్లి గురువారం బాధిత రైతులతో మాట్లాడి వివరాలు సేకరించారు. ఈ ఘటన వివరాలు...
నవతెలంగాణ- ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని నెహ్రూనగర్, మంగళి, రాజీవ్నగర్ తండాకు చెందిన టీఆర్ఎస్ నాయకులు భూక్యా గోవింద్, కాంగ్రెస్కు చెందిన దళ్సింగ్ నరేష్, శ్రీను కలిసి 10 మంది రైతుల భూమిపై నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు. దానితో రైతుబందు చెక్కులపై రూ.1,53,600 స్వాహా చేశారు. ఇందులో వీఆర్ఓ, వీఆర్ఏ, సంబంధిత బ్యాంకు అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న రైతులను మభ్యపెట్టి చనిపోయిన, బతికి ఉన్న మొత్తం 10 మంది రైతులకు సంబంధించిన పాసుపుస్తకాలు తయారు చేశారు. ఆధార్ కార్డులో ఫొటో మార్ఫింగ్, సంతకాలు ఫోర్జరీ చేసినట్టు తెలిసింది. చనిపోయిన బానోత్ తకిర్యా, భూక్యా మల్లు ఇంకా కొందరు మృతుల పేరున వచ్చిన చెక్కులను స్వాహా చేశారు.
రైతుల పేరున చెక్కులు మాయం
భూక్యా శ్రీను పేరున రూ.17,600, మాలోత్ వాస్య రూ.20,000, భూక్యా మల్లు (చనిపోయిన రైతు) రూ.8,400, పిల్లల మర్రి మంగి రూ.23,200, తేజావత్ కృష్ణ రూ.20,400, జాటోత్ రమేష్ రూ.11,200, అజ్మీర్ సామ్య రూ.40,000, బానోత్ చందర్ రూ.6,400, మూడ్ బాద్య రూ.19,200, బానోత్ తకిర్యా (చనిపోయిన రైతు) రూ.27,200 కాజేశారు. ఈ మొత్తం సొమ్ము రూ.1,53,600 అని తేలింది. ఈ విషయం బయటపడటంతో టీఆర్ఎస్కు చెందిన భూక్యా గోవింద్, కాంగ్రెస్కు చెందిన దళ్సింగ్ బాధిత రైతులతో బేరసారాలు మాట్లాడినట్టు సమాచారం. రైతులను గురువారం తండాలోకి పిలిపించుకుని డబ్బులు వాపస్ ఇచ్చేస్తాం కేసులు పెట్టొద్దని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది.
విచారణ చేసి క్రిమినల్ కేసులు పెడతాం : తహసీల్దార్
చల్లసముద్రం గ్రామ పంచాయతీలో రైతుబంధు చెక్కుల విషయంలో జరిగిన అవినీతిపై జిల్లా అధికారులు తహసీల్దార్ను మందలించి నివేదిక పంపించాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. దీంతో తహసీల్దార్ వై.శ్రీనివాసులు నెహ్రూనగర్ గ్రామానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. 10మంది రైతులకు చెందిన రూ.1,53,600 కాజేసినట్టు తెలిపారు. నిందితుల్లో టీఆర్ఎస్కు చెందిన భూక్యా గోవింద్, కాంగ్రెస్కు చెందిన ధళ్సింగ్ నరేష్, శ్రీనుతోపాటు మరొకరు ఉన్నట్టు తెలిపారు. విచారణ అనంతరం తేలిన నిందుల్లో ఎఈఓ, వీఆర్ఓ, ఆర్ఐలు ఇతరులు ఎవరున్నా వదిలిపెట్టేది లేదని చెప్పారు. క్రిమినల్ కేసులు పెడుతామని తెలిపారు.