Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజకీయ పార్టీలకు బీఎల్ఎఫ్ చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ సవాల్
- ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని కాంగ్రెస్ తీర్మానం చేయాలి
- వచ్చే ఎన్నికల్లో తాము బీసీలకు 65 ఎమ్మెల్యే సీట్లిస్తాం
- బీసీని అధ్యక్షుడిని,సీఎంను చేస్తుందా?: టీఆర్ఎస్కు ఉత్తమ్ సూటి ప్రశ్న
- ఐక్యతతోనే సామాజిక న్యాయం : ఆర్ కృష్ణయ్య
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించే దమ్ముందా?అని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ అన్ని రాజకీయ పార్టీలకూ సవాల్ విసిరారు. అధిక జనాభా ఉన్నోళ్లకు ఆ పదవి ఇవ్వడమే సామాజిక న్యాయమని అన్నారు. బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన రాజకీయ పార్టీలకే మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నల్లా సూర్యప్రకాశ్ మాట్లాడుతూ గొర్రెలు, బర్రెలు ఇవ్వడం సామాజిక న్యాయం కాదని చెప్పారు. రాజ్యాధికారంలో వాటా ఇవ్వడమే నిజమైన సామాజిక న్యాయమని అన్నారు. ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వడం సామాజిక న్యాయం అవుతుందని చెప్పారు. బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు. బీఎల్ఎఫ్ వచ్చే ఎన్నికల్లో బీసీలకు 65 ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తుందని అన్నారు. మిగతా రాజకీయ పార్టీలు అన్ని సీట్లు ఇస్తుందా?అని ప్రశ్నించారు. ఎవరి జనాభా ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్లు ఉండాలని సూచించారు. రాష్ట్రం రెడ్ల జాగీరా?అని ప్రశ్నించారు. రెడ్డిలు అధికారంలోకి రావాలని చెప్పడాన్ని తప్పుపట్టారు. పాలించడానికి రెడ్డీలే పనికొస్తారా?అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీ అని కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. అధిక జనాభా ఉన్నందున బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్ని రాజకీయ పార్టీలూ ప్రకటించాలని కోరారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ వర్గీకరణ ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న పార్టీలు కుమ్మక్కు కావడం వల్లే శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు ఇక్కడ ఉంటున్నాయని చెప్పారు. కార్పొరేట్ విద్యావైద్యానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బీసీల ప్రతినిధిగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఓ రాజకీయ పార్టీని స్థాపించాలని ఆకాంక్షించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీకి అధ్యక్షుడిగా, అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా ఓ బీసీని చేస్తుందా?అని టీఆర్ఎస్ను సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బీసీలకు ఐదేండ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిందని చెప్పారు. కానీ ఈ నాలుగేండ్లలో రూ.8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, బీసీలను టీఆర్ఎస్ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా బీసీ విద్యార్థులను ఇబ్బంది పెడుతోందని చెప్పారు. యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఉద్యోగాలకు, పై చదువులకు వెళ్లడం లేదన్నారు. నాలుగేండ్లలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, వారిలో బీసీలే ఎక్కువున్నారని అన్నారు. వడ్డీ చెల్లించలేక, పంటలకు గిట్టుబాటు ధర రాక అప్పులపాలై ఆత్మహత్యలకు పాల్పడ్డారని చెప్పారు. అధికార పార్టీ నాయకులు పరామర్శించలేదని ఆరోపించారు. బీసీ మంత్రులకు గౌరవం లేదన్నారు. బీసీ సబ్ప్లాన్ను ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు. బీసీలను అన్ని విధాలుగా మోసం చేసిందన్నారు. చేపలు, గొర్రెలు, బర్రెలు ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. బీసీ-ఈ (మైనార్టీ) రిజర్వేషన్లు పెంచినపుడు, జనాభా దామాషా ప్రకారం బీసీ ఏ,బీ,సీ,డీ రిజర్వేషన్లను ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు పి ఆశయ్య మాట్లాడుతూ రాజ్యాధికారంలో బీసీలకు తగిన వాటా దక్కాలని అన్నారు. తెలంగాణలో స్వయం పాలన పేరుతో దొరల పాలన సాగుతోందని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్లను వర్గీకరణ వారీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ ఏ,బీ,సీ,డీ,ఈ రిజర్వేషన్లను అమలు చేయకపోవడం వల్ల కొన్ని కులాలకే అవకాశాలొస్తున్నాయని, ఎక్కువ కులాలకు నష్టం జరుగుతోందని చెప్పారు. సామాజిక న్యాయం సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాలమల్లేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో గడీల పాలన, దొరల పాలన సాగుతోందని చెప్పారు. అందరికీ విద్యావైద్యం అందే వరకు పోరాడాలని అన్నారు. పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్లు పెరగాలని చెప్పారు. బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అట్టడుగు వర్గాలకు అధికారం అందడమే సామాజిక న్యాయం లక్ష్యమని అన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్కు ఉన్నట్టుగానే బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధత కల్పించాలని కోరారు. బీసీలు పరిశ్రమలు స్థాపిస్తామంటే ముద్రా బ్యాంకు ద్వారా రూ.5 కోట్ల వరకు రుణాలు ఇప్పిస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ది మాటల గారడీ తప్ప మరొకటి కాదన్నారు. బీసీ డిక్లరేషన్ ఒక్క అడుగు ముందుకు పడడం లేదని అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు మాట్లాడుతూ బీసీల్లో ఉండే అనైక్యత అగ్రకులాలకు అవకాశంగా మారిందని చెప్పారు. క్రీమీలేయర్ను ఎత్తివేస్తేనే బీసీలకు భవిష్యత్తు ఉంటుందని అన్నారు. టీటీడీపీ నేత వీరేందర్గౌడ్ మాట్లాడుతూ బీసీల్లో చైతన్యం రావాలని, ఐక్యం కావాలని చెప్పారు. అప్పుడే రాజ్యాధికారంవైపు అడుగులు పడతాయని అన్నారు.
రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉంది : ఆర్ కృష్ణయ్య
రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన ఉందని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఆర్థిక వనరులు ఎట్లా?అన్నదే ప్రధాన సమస్యగా ఉందన్నారు. రాజకీయ పార్టీ పెడితే రాష్ట్రంలో బీసీ ఉద్యమం భగ్గుమంటుందని, ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని చెప్పారు. ఆర్థిక మద్దతు దొరికితే గన్ పేల్చుతానని ప్రకటించారు. అప్పుడు కోటల గోడలు కూలిపోతాయని అన్నారు. తన ప్రతి అడుగూ రాజ్యాధికారం దిశగానే పడుతోందని చెప్పారు. ఎక్కడికెళ్లినా రాజకీయ పార్టీ పెట్టాలని అడుగుతున్నారని అన్నారు. పార్టీ పెట్టాలని తనకు కార్యకర్తల కంటే ఎక్కువ ఉత్సాహం ఉందని చెప్పారు.
తమ్మినేని వీరభద్రం బీఎల్ఎఫ్లోకి రావాలని అడిగారని అన్నారు. అనేక మంది సలహాలు తీసుకుంటున్నామని చెప్పారు. పంచాయతీల్లో బీసీల రిజర్వేషన్లు 56 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. బీసీల మొత్తం ఫీజులను ప్రభుత్వమే భరించాలని కోరారు. బీసీలకు బీఎల్ఎఫ్ 65 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని ప్రకటించిందని, మిగతా పార్టీలూ ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్రంలో 9 ఎంపీ సీట్లు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలు జెండాలు మోయడానికి, జిందాబాద్లు కొట్టడానికే పనికొస్తారా?అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో బీసీలు సీఎంలు అయ్యారని, తెలంగాణలో ఎందుకు కాలేరని అన్నారు. ఈనెల 26న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజారాం యాదవ్, బీఎల్ఎఫ్ కన్వీనర్లు గొర్రె రమేష్, గుజ్జ రమేష్, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్, తెలంగాణ ప్రయివేటు విద్యాసంస్థల జేఏసీ నేత గౌరి సతీష్, ఎంఐఎం కార్పొరేటర్ రాజేందర్, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.