Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండగా రెవెన్యూ అధికారులు!
- 25 ఏండ్లుగా కాస్తులో ఉన్నా దళితులకు పట్టా ఇవ్వని వైనం
- రోడ్డున పడనున్న 150 కుటుంబాలు
అసలే వారు గ్రామ పెత్తందారులు. రియల్, ఇతర వ్యాపారాల్లో ఆరితేరారు. ఆపై అధికార పార్టీ ముఖ్యనేత అండదండలుండటంతో 25 ఏండ్ల కింద దళితులకు అమ్మిన భూమిపై కన్నేశారు. భూప్రక్షాళనలో తమ పలుకుబడితో దళితులకు పట్టాలు అందకుండా అడ్డుకున్నారు. కాస్తులో ఉన్నవారికి పట్టాపాసుబుక్కులివ్వాలని నిబంధన ఉన్నా...రెవెన్యూ అధికారులు మాత్రం పెత్తందారులకే కొమ్ముకాశారు. దీంతో 150 కుటుంబాలు రోడ్డున పడనున్నాయి. రైతుబంధుకూ దూరమయ్యాయి. 'మా భూములు మాకు ఇప్పించండి' అంటూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో దళితులు పోరుబాట పడుతున్నారు.
నవతెలంగాణ-జనగామ ప్రతినిధి
జనగామ జిల్లా నర్మెట మండలం హన్మంతాపురంలో సర్వే నెంబర్ 77/బి, 78/ఎ, 78/బి, 78/సీ, 78/డి, 77బి/2 సర్వే నెంబర్లలో అదే గ్రామానికి చెందిన పజ్జూరి మురళీమనోహర్కు 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 1990లో గ్రామ దళితులు అతని వద్ద నుంచి కొనుగోలు చేశారు. 20 మంది పేర సాదా అంగీకార పత్రాన్ని రాసుకున్నారు. అప్పటి నుంచి దళితులంతా ఉమ్మడిగా సాగు చేసుకుంటున్నారు. కొనుగోలు చేసిన సందర్భంగా 70 కుటుంబాలుండగా ఇప్పుడు వారి పిల్లలతో కలిపి ఆ సంఖ్య 150కి పెరిగింది. రెవెన్యూ రికార్డులో ఆ భూమి మురళీమనోహర్ పేర ఉన్నట్టు, కాస్తులో దళితులున్నట్టు నమోదై ఉంది. 1996 నుంచి ఇప్పటి వరకు రికార్డుల్లో అదే విధంగా ఉంది. రియల్ భూం పెరగడంతో రికార్డుల్లోని లొసుగుల్ని ఆసరాగా చేసుకొని దళితులకు భూమిని విక్రయించిన పజ్జూరి మురళీమనోహర్ కొడుకులు జయహరి, లక్ష్మినర్సయ్య అడ్డం తిరిగారు. వారిలో ఒకరు జనగామలో వ్యాపారం చేస్తుండగా మరొకరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మురళీమనోహర్ అన్న కొడుకు పజ్జూరి గోపయ్య జనగామలో ప్రముఖ వ్యాపారి. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలున్న వ్యక్తి. వీరు దళితులకు విక్రయించిన భూమిని కాజేసేందుకు అరిగే భిక్షపతి అనే ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఉసిగొల్పుతున్నట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే దళితుల్లో చీలిక తెచ్చేందుకు యత్నాలు మొదలెట్టారు. కొనుగోలు చేసిన సందర్భంగా కాగితంలో ఉన్న పేర్లకు చెందిన కుటుంబాల వారికి లక్ష చొప్పున ఇస్తామని ఆశచూపించే ప్రయత్నం చేశారు. దీనిని దళితులంతా వ్యతిరేకించారు. 'మీరు కట్టిన డబ్బులకు వడ్డీతో కలిపి ఇస్తాం. మా భూమి మాకు ఇచ్చేయండి. లేనిపక్షంలో ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు' అంటూ దళితుల్ని మురళీమనోహర్ కొడుకులు బెదిరిస్తున్నారు. దీంతో దళితులు రెవెన్యూ అధికారుల్ని ఆశ్రయించారు. వారు కూడా ఆ పెత్తందారులవైపే కొమ్ముగాయడంతో సాదా బైనామాలో కూడా పేర్లు మారలేదు. ఇప్పటికీ పట్టా పాసుబుక్కులను దళితులకు ఇవ్వలేదు. రైతు బంధు సహాయం అందించలేదు. ఈ విషయమై ఆర్డీఓకు దళితులు ఫిర్యాదు చేయడంతో తహసీల్దార్తో పాటు వీఆర్ఓ నాలుక కరుచుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి నుంచి భారీగా మండల రెవెన్యూ అధికారులకు ముడుపులు ముట్టాయనే ప్రచారమూ జరుగుతున్నది.
చంపుతామని బెదిరిస్తున్నారు : ఇరుగు యాదగిరి, దళితుడు
మా తండ్రులు ఉమ్మడిగా భూమి కొన్నరు. మేమూ ఉమ్మడిగానే సాగు చేసుకుంటున్నం. భూముల ధరలు పెరగడంతో పజ్జూరి లక్ష్మినర్సయ్య, జయహరి, గోపయ్యలు భూప్రక్షాళనలో మాకు పట్టా కాకుండా అడ్డుకున్నరు. దీనిపై రెవెన్యూ అధికారులను ప్రశ్నిస్తే.. ఆర్ఐ నర్సింహ నన్ను చంపుతనని బెదిరించుడు. 'రూపాయికి కిలో బియ్యం తినే వాళ్లు....' అంటూ ఎగతాళి చేశారు. 25 ఏండ్ల నుంచి కాస్తులోనే ఉన్న మా పేర భూమి ఎక్కించకుండా మమ్మల్ని బెదిరించి భూమిని కాజేయాలని చూస్తున్నారు.
భూమిని వదులుకునేది లేదు : ఇరుగు నాగమ్మ, సర్పంచ్
దళితుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భూముల్ని కాజేయాలని చూడటం సరికాదు. మా పూర్వీకులు చట్ట ప్రకారం కొనుగోలు చేశారు. కాస్తులోనూ దళితులే ఉన్నట్టు రికార్డుల్లో ఉంది. అది మాకే చెందాలి. మేము మాత్రం భూముల్ని వదులుకునేది లేదు. ప్రాణమివ్వడానికైనా సిద్ధం.
కలెక్టర్కు నివేదిస్తాం : వెంకటేశ్ తహసీల్దార్
దళితులు కాస్తులో ఉన్న మాట వాస్తవమే. రికార్డులు సరిచేయాల్సిన సందర్భంగా వారి పేర్లను ఎక్కించాలి. పట్టాదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో నిలిపేశాం. ఈ విషయమైన కలెక్టర్కు సమగ్ర నివేదిక ఇస్తాం. కాస్తులో ఉన్న వారికే పట్టాదారు పాసుబుక్కులు ఇవ్వాలని కోరతాం.
దళితులకు అండగా ఉంటాం: రాపర్తి రాజు, బీఎల్ఎఫ్ జిల్లా నాయకులు
మల్కపేట, మచ్చుపహాడ్లో వందలేండ్ల కింది నుంచి ఉన్న భూ సమస్యను టీమాస్ ఆధ్వర్యంలో పరిష్కరించాం. పట్టాలిప్పించాం. హన్మంతాపూర్ గ్రామ దళితులకు బీఎల్ఎఫ్ అండగా ఉంటుంది. పెత్తందారులకు తొత్తులుగా ఉన్న అధికారుల తీరును ప్రశ్నిస్తూ పోరాడుతాం. దళితులకు పట్టాలిచ్చేవరకూ కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు చేస్తాం.