Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కోసం అడ్డదారులు
- పరేేడ్కు రాకున్నా విద్యార్థులకు సర్టిఫికెట్లు..
- ఈ కోటాలోనే కేంద్ర మాజీ మంత్రి పీఏ కుటుంబీకులకు సీటు
- గతంలో వచ్చిన ఫిర్యాదులపై చర్యలు శూన్యం
- తాజాగా ఏసీబీకి ఫిర్యాదులు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
క్రీడాకోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల కేటాయింపుల్లో అక్రమాలపై విచారణ ఇంకా ముగియక ముందే తాజాగా అలాంటి మరో వివాదం తెరమీదికొచ్చింది. నేషనల్ క్యాడెడ్ కార్ఫ్స్(ఎన్సీసీ) కోటా సీట్ల కేటాయింపుల్లోనూ గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ప్రతివారం జరిగే పరేడ్ చేయకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఘటనలూ నగరంలో చోటు చేసుకోవడంతో ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరినట్టయింది. తాజాగా ఇదే అంశంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి ఓ న్యాయవాది ఫిర్యాదు చేయడంతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు సుమారు 4,500 వరకు ఉంటాయి. వీటికోసం ఈ ఏడాది ప్రవేశపరీక్ష(నీట్)కు లక్షల్లో విద్యార్థులు హాజరై, దాదాపు 60వేల మంది అర్హత సాధించారు. విద్యార్థులకు వివిధ రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. దీంట్లో ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా సీట్లు చాలా కీలకమైనవి. తక్కువ ర్యాంకులు వచ్చినా, సీట్లు లభించే ఏకైనా మార్గం ఈ రెండింటిలోనే ఉంది. ఇటీవల స్పోర్ట్స్ విభాగాన్ని ఆన్లైన్లో పొందుపరుస్తుండటంతో అక్రమార్కుల చూపు ఎన్సీసీ కోటాపై పడింది. ప్రస్తుతం ఎన్సీసీ కోటాలో ఒకశాతం సీట్లు కేటాయిస్తుండటంతో ఈ సర్టిఫికెట్లకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో ఎంబీబీఎస్ సీటు రూ.50లక్షల నుంచి రూ.2కోట్ల వరకూ పలుకుతున్నది. దీంతో లక్షలు పెట్టి, సర్టిఫికెట్లు పొందుతున్నారనే ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయి వసతులు ఉంటేనే ఎన్సీసీ యూనిట్కు ప్రభుత్వం అనుమతిస్తుంటుంది. మెజార్టీ కార్పొరేట్ కాలేజీల్లో ఈ యూనిట్లు ఉండవు. దీంతో దాంట్లో చదివే వారంతా ఎన్సీసీ యూనిట్లు ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్ కాలేజీల వైపు చూస్తున్నారు. ఆయా కాలేజీల్లోని ప్రిన్సిపాల్స్, ఎన్సీసీ ఇన్చార్జీలను మచ్చిక చేసుకుని, ఆ యూనిట్లలో పేర్లు నమోదు చేయించుకుని సర్టిఫికేట్లు పొందుతున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి.
ఇదిగో మచ్చుకు ఓ ఉదాహరణ...
నగరంలోని దోమలగూడ ప్రాంతంలో ఎయిడెడ్ కాలేజీలో సుమారు 1300 మంది వరకూ విద్యార్థులుంటారు. ఈ కాలేజీలో 2016-17లో మూడు ఎన్సీసీ యూనిట్లున్నాయి. వీటి పరిధిలో సుమారు 180 నుంచి 200 మంది వరకూ విద్యార్థులను ఆయా యూనిట్లలో తీసుకునే అవకాశముంది. ఎన్సీసీలో చేరేందుకు చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అయినా ఆ కాలేజీ ఎన్సీసీ ఇన్చార్జీ జగన్మోహన్రెడ్డి మాత్రం ఇతర కార్పొరేట్ కాలేజీలకు చెందిన 20మందికి పైగా విద్యార్థులకు ఎన్సీసీ సీట్లు కేటాయించారు. వాస్తవానికి యూనిట్ ఉన్న కాలేజీల్లో విద్యార్థులు లేని సందర్భంలోనే ఇతర కాలేజీలకు సీట్లు కేటాయించాలనే నిబంధన ఉంటుందని సీనియర్ విద్యార్థులు చెబుతున్నారు. కాలేజీలో ప్రతి శుక్రవారం లేదా శనివారం ఎన్సీసీ పరేడ్స్ నిర్వహిస్తుంటారు. ఇతర కాలేజీలకు చెందిన మాత్రం ఏనాడూ పరేడ్స్కు హాజరు కాలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని విద్యార్థులు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వీవై గిరికి ఫిర్యాదు చేశారు. అయితే అప్పటి వరకూ ఆ ప్రిన్సిపాల్కు కూడా ఈ విషయం తెలియకపోవడంతో ఆయనా కంగుతిన్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్కు రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కాలేజీ ఎన్సీసీ ఇన్చార్జి బాధ్యతల జగన్మోహన్రెడ్డిని తప్పించారు. ప్రధానంగా మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల కోసమే దీనిలో చేరినట్టు తెలుస్తోంది. ఏనాడూ ఎన్సీసీ పరేడ్కు హాజరుకానీ ఓ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న ఓ కేంద్ర మాజీ మంత్రి పీఏ కూతురుకు ఈ కాలేజీ నుంచి సర్టిఫికెట్ అందడంతో ప్రస్తుతం ఆమెకు ఎంబీబీఎస్ సీటు కూడా ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. గత కొన్నెండ్లుగా ఈ వ్యవహారం జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నా, ఉన్నతాధికారులు కనీసం విచారణ చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇలాంటి పరిస్థితి చాలా కాలేజీల్లోనూ కొనసాగుతుందనే వాదనలూ ఉన్నాయి.
తాజాగా ఓ న్యాయవాది అర్హత లేని ధ్రువపత్రాలతో 2013-14 నుంచి 2015-16 విద్యా సంవత్సరాల్లో సీట్లు పొందారని ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 2013 నుంచి 2015 కాలంలో రిపబ్లిక్ డే పరేడ్కు గెస్ట్గా వెళ్లిన వారికి ఎంబీబీఎస్ సీట్లు కేటాయించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్సీసీ కోటాపై ప్రత్యేకంగా దృష్టిసారించి, గడిచిన ఐదేండ్ల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలనీ, తద్వారా అక్రమంగా సీట్లు పొందిన వారి వివరాలు బయటికొస్తాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.