Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదేబాటలో ముఖేష్గౌడ్?
- మంత్రి తలసాని రాయబారం
- నేడు టీఆర్ఎస్లోకి...
- ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి తిరస్కరణ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దానం నాగేందర్ ఏఐసీసీ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదే బాటలో మరో కాంగ్రెస్ సీనియన్ నేత, మాజీ మంత్రి ముఖేష్గౌడ్ కూడా నడువనున్నట్టు ప్రచారం జరుగుతోంది. దానం కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేయగానే తెలంగాణ రాష్ట్ర సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో భేటీ అయ్యారు. దానం టీఆర్ఎస్లో చేరడం లాంఛనమేనని ఈ సందర్భంగా తలసాని వ్యాఖ్యానించారు. రాజీనామా విషయం తెలియగానే పీసీపీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి దానం నాగేందర్ ఇంటికి వెళ్లారు. ఆయన్ని సముదాయించే ప్రయత్నం చేశారు. ఉత్తమ్ విజ్ఞప్తిని దానం సున్నితంగా తిరస్కరించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దానం నాగేందర్ తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానం నాగేందర్ పార్టీ మారడం కొత్తేం కాదు. గతంలో ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి, టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి రాత్రికి రాత్రి పార్టీలు మారిన చరిత్ర ఉంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పటిష్టమైన నాయకత్వం లేదు. దీంతో ఆపార్టీ నేతలు ఇతర పార్టీల్లోని నాయకులపై దృష్టి పెట్టారు. ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కూడా సనత్నగర్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశంపార్టీ తరఫున గెలిచిన వ్యక్తే కావడం గమనార్హం. అలాగే గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్పార్టీ టిక్కెట్పై ఎమ్మెల్యేగా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎక్సైజ్శాఖ మంత్రి టి పద్మారావు ఒక్కరే గెలిచారు. మిగిలిన నియోజకవర్గాల్లో ఇతర పార్టీల తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చివరకు టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి సీఎం కేసీఆర్ మధ్యంతర ఎన్నికలకు వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే దానం నాగేందర్ టీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఈ ప్రచారాన్ని ఆయన ఎప్పుడూ కొట్టిపారేయలేదు. అదే సమయంలో చాలా కాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలంతా ఢిల్లీ వెళ్లి రాహుల్గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ టూర్కు దానం డుమ్మా కొట్టారు.
అదేబాటలో ముఖేష్గౌడ్....
మరో మాజీ మంత్రి, గోషామహల్ మాజీ ఎమ్మెల్యే ముఖేష్గౌడ్ అతని కుమారుడు విక్రమ్గౌడ్ కూడా త్వరలో టీఆర్ఎస్ తీర్ధం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్పార్టీలో చర్చ జరుగుతోంది. గోషామహల్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం బీజేపీ తరఫున రాజాసింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్పార్టీలో ఉంటే రాజాసింగ్ను ఎదుర్కొవడం సాధ్యం కాదని, టీఆర్ఎస్లో చేరితే ఎంఐఎం మద్దతు కూడా ఉంటుంది కాబట్టి ఈసారి గోషామహల్ నుంచి విజయం సాధించడం సులభం అవుతుందనేది ముఖేష్గౌడ్ రాజకీయ ఎత్తుగడగా ఉన్నట్టు సమాచారం. దానం రాజీనామా, ముఖేష్ గౌడ్ కూడా పార్టీని వీడతారనే ఊహాగానాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు శాసనసభలో ప్రతిపక్షనేత కె జానారెడ్డి ఇంట్లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.
బీసీలను పట్టించుకోవట్లేదు...
రాజీనామా లేఖలో దానం
కాంగ్రెస్పార్టీలో బీసీలను పట్టించుకోవట్లేదని, జనాభా ప్రాతిపదికగా వారికి దక్కాల్సిన వాటాను ఇవ్వట్లేదని ఆపార్టీకి రాజీనామా చేసిన దానం నాగేందర్ తన లేఖలో పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీకి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు ఉత్తమ్కుమార్రెడ్డికి సమర్పించినట్టు తెలిపారు. తాను గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ తన అధికారాలు, పరిధిని కుదించారని రాజీనామా లేఖలో ఆరోపించారు. కాంగ్రెస్పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దూరం అవుతోందని, వారంతా తీవ్రమైన అభద్రతాబావంలో ఉన్నారని తాను పలుమార్లు అనేక వేదికలపై ప్రస్తావించినా కాంగ్రెస్ నాయకత్వం ఏమాత్రం పట్టించుకోలేదని ఆ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ వల్ల బీసీలకు న్యాయం జరిగే అవకాశాలు లేనందునే తాను ఆపార్టీకి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు.
దానంను అహ్వానిస్తాం-మంత్రి తలసాని
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం టీఆర్ఎస్లో చేరికపై దానం నాగేందర్ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో చర్చించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ పార్టీలోకి ఎవరు వచ్చిన సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. 60 ఏండ్లలో జరగని అభివద్ధిని కేవలం నాలుగున్నరేండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారన్నారు. మాజీమంత్రి, సీనియర్ నేత దానం నాగేందర్ను.. టీఆర్ఎస్లోకి తీసుకునే అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. '' దానంలాంటి వ్యక్తికి ప్రత్యేకంగా ఓ పర్సనాలిటీ, ఇమేజ్.. బ్యాక్ గ్రౌండ్ ఉన్నాయి. అందులోనూ బీసీనేత కాబట్టి ఆయనొస్తే కచ్చితంగా మేం తీసుకుంటాం. దానం రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్మీట్ పెట్టి అన్ని విషయాలను నిశితంగా వివరిస్తారు'' అని తలసాని చెప్పారు. బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుంది. పవిత్రమైన శాసనసభ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ వీళ్లంతా బీసీ నాయకులే. ఇటీవల రాజ్యసభలో ఎన్నికల్లో మూడు సీట్లల్లో రెండు బీసీలకే ఇచ్చాం. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే'' అని తలసాని చెప్పుకొచ్చారు.