Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతికందని రూ.45.15 కోట్ల సాయం
దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం
- ఆర్నెల్లు దాటినా అందని 'పెండ్లి' పథకాలు
నవతెలంగాణ- నల్లగొండ ప్రతినిధి
నార్కట్పల్లి మండల కేేంద్రానికి చెందిన జహంగీర్ కుమార్తె ఆయేషాసిద్దికి పెండ్లి అయ్యి ఆర్నెళ్లు దాటింది. రూ.లక్షా 116 ఆర్థిక సాయం కోసం షాదీముబారక్ పథకం కింద దరఖాస్తు చేశారు. దరఖాస్తు పరిశీలించిన అధికారులు అర్హురాలిగా గుర్తించారు. కానీ ట్రెజరీలో పెండింగ్ పెట్టడంతో ఇంత వరకు ఆ కుటుంబానికి చెక్ అందలేదు. నల్లగొండ పట్టణంలోని రాంనగర్కు చెందిన దుబ్బ లింగయ్య కుమార్తె శృతి వివాహం జరిగి రెండు నెలలైంది. పెండ్లి నాటికే కల్యాణలక్ష్మి ఆర్థిక సహాయం అందజేస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు. దరఖాస్తు ఇంకా వీఆర్ఓ పరిశీలన దశలో ఉందని చెబుతున్నారు.
నల్లగొండ జిల్లాలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకుని ఆర్థిక సహాయం కోసం నెలల తరబడి ఎదురు చూస్తున్నవారు చాలామంది ఉన్నారు. ఈ పథకాల కింద జిల్లాలో రూ.45.15 కోట్ల మేరకు పెండింగ్లో ఉంది. నల్లగొండ జిల్లాలో కల్యాణలక్ష్మి పథకానికి 4,352 దరఖాస్తులందాయి. వీటిల్లో 225 మందికి మాత్రమే ఆర్థిక సాయం అందింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత వీఆర్వో, తహసీల్దార్ విచారణ చేసి ప్రతిపాదనల్ని స్థానిక ఎమ్మెల్యేకు పంపుతారు. ఎమ్మెల్యే విచారించి మంజూరు కోసం ఆర్డీఓల ద్వారా జిల్లా రెవెన్యూ అధికారికి ప్రతిపాదనలు పంపుతారు. మంజూరయ్యాక ట్రెజరీ ద్వారా బిల్లులు పాసవుతాయి. షాదీముబారక్ పథకం ద్వారా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 363 దరఖాస్తులు రాగా, ఒక్కరికీ బిల్లు పాసవ్వలేదు.
రికార్డుల ప్రక్షాళనతో పట్టించుకోని వైనంకల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల్ని రెవెన్యూ శాఖ ద్వారా అమలు చేస్తున్నారు. వీటి కోసం ప్రత్యేక సిబ్బంది ఏమీ లేరు. దరఖాస్తుల్ని పరిశీలించి ప్రతిపాదనలు చేయాల్సిన వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీఓ, డీఆర్వోలంతా భూరికార్డుల ప్రక్షాళన, పాసుపుస్తకాలు, చెక్కుల పంపిణీ పనిలో ఉన్నారు. దీంతో ఈ దరఖాస్తుల పనిని పక్కనపెట్టేశారు. ఎమ్మెల్యేలు సైతం పెండింగ్లో పెట్టారు. మూడు నెలలుగా ఇతర పనుల వల్ల దరఖాస్తుల్ని పట్టించుకోలేదని అధికారులు చెబుతున్నారు. సిబ్బంది కొరత వల్ల బహుళ పనులు చేయలేకపోతున్నామని ఓ తహసీల్దార్
ఆవేదన వ్యక్తం చేశారు.
నిధులివ్వకపోవడం వల్లే..
పాలడుగు నాగార్జున- కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు నిధులివ్వడం లేదు. పెండ్లికి నెల ముందే దరఖాస్తు చేసుకుంటే పెళ్లినాటికి డబ్బులిస్తామని చెప్పిన ప్రభుత్వం.. పెండ్లి జరిగి ఆర్నెళ్లు గడిచినా బడ్జెట్ ఇవ్వట్లేదు. తహసీల్దార్లు, ఎమ్మెల్యేలు, ట్రెజరీల్లో పెండింగ్ ఉండటమే కాకుండా బడ్జెట్ సరిపడా రాకపోవడంతో బిల్లులు పాసవ్వట్లేదు. దరఖాస్తుదారులందరికీ వెంటనే చెక్కులివ్వాలి.
కల్యాణలక్ష్మి పథకం పెండింగ్ దరఖాస్తుల వివరాలు
రెవెన్యూ డివిజన్ దరఖాస్తులు తహసీల్దార్లు ఎమ్మెల్యేల వద్ద మంజూరులో ట్రెజరీ పాసైన బిల్లులు
నల్లగొండ 1687 767 239 48 552 81
మిర్యాలగూడ 1388 427 326 189 302 144
దేవరకొండ 1277 665 220 183 209 0
మొత్తం 4352 1859 785 420 1063 225
షాదీముబారక్ పథకం పెండింగ్ దరఖాస్తుల వివరాలు..
దేవరకొండ 69 30 8 15 10 6
మిర్యాలగూడ 134 36 42 17 23 16
నల్లగొండ 160 91 39 2 18 10
మొత్తం 363 157 89 34 51 32