Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ కార్మికుల ధర్నాలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
విద్యుత్శాఖలో పనిచేస్తున్న పీస్రేట్ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాల జేఏసీ చైర్మెన్ కె ఈశ్వర్రావు డిమాండ్ చేశారు. 15, 20 ఏండ్ల నుంచి సంస్థలో పనిచేస్తున్న యాజమాన్యం పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. ఈఎస్ఐ కార్పొరేషన్ ఎదుట విద్యుత్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ...తెలంగాణ విద్యుత్ సంస్థలు ట్రాన్స్కో, జన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లలో 23,667 మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్మికులందరికీ 2017 జులై నుంచి విద్యుత్ యాజమాన్యమే నేరుగా వేతనాలు ఇస్తుందని తెలిపారు.
అయితే కార్మికుల వేతనం నుంచి కార్మికుల వాటాతో పాటు యాజమాన్యం చెల్లించాల్సిన వాటానూ కట్ చేస్తున్నారని చెప్పారు. దీంతో కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. దీంతో పాటు పీస్రేట్ కార్మికులు అనే పేరుతో రాష్ట్రంలో 6,500 మంది కార్మికులు ఏండ్ల నుంచి పనిచేస్తున్నా, వారికి కనీసం ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ఈఎస్ఐ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, పీస్రేట్ కార్మికులకు ఈఎస్ఐ సౌకర్యంతో పాటు ఆర్టిజన్ కార్మికులకు కట్ చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని తిరిగి కార్మికులకు ఇప్పించాలని కోరారు.
ధర్నా అనంతరం ఈఎస్ఐ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు వినతిపత్రం అందించారు. ధర్నాలో జేఏసీ కో చైర్మెన్ అంబాదాస్, కన్వీనర్ గంగో నాగరాజు, కో కన్వీనర్ కె రమేశ్, వైస్ చైర్మెన్ జి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.