Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీల వెబ్ఆప్షన్లలో లోపాలను సవరించాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) డిమాండ్ చేసింది. ఎస్జీటీలకు విడతల వారీగా వెబ్కౌన్సెలింగ్ జరపాలని కోరింది. ఈ మేరకు యూఎస్పీసీ నాయకులు సిహెచ్ రాములు, బి కొండల్రెడ్డి, ఎం రఘుశంకర్రెడ్డి, యు పోచయ్య, సయ్యద్ షౌకత్ అలీ, జాడి రాజన్న, కొమ్ము రమేష్, హరికిషన్, మసూద్, అహ్మద్, ఎస్ మధుసూదన్రావు, కె సుభాష్, ఎస్ కైలాసం, చావ రవి, మైస శ్రీనివాస్, టి లింగారెడ్డి, డి సైదులు, కె నరసింహారావు సంయుక్తంగా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎస్జీటీలను 500 మందికి ఒకరోజు చొప్పున విడతల వారీగా వెబ్ఆప్షన్లు తీసుకునేలా కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయుల బదిలీల వెబ్ఆప్షన్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ప్రారంభమైందని తెలిపారు. వాటన్నింటినీ అధికారుల దృష్టికి తెస్తే సవరించే ప్రయత్నం చేసినా ఇంకా ఉపాధ్యాయుల్లో అనేక సందేహాలు అపరిష్కృతంగానే ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నివృత్తి చేసి వెబ్కౌన్సెలింగ్ పట్ల విశ్వాసాన్ని పెంచాల్సిన బాధ్యత విద్యాశాఖపైనే ఉందని తెలిపారు. ప్రధానోపాధ్యాయులిచ్చిన ఆప్షన్ల ప్రకారం వారి బదిలీలు నిర్వహించి, వాటి ఫలితాల ఆధారంగా మిగిలిన బదిలీలు చేపట్టాలని కోరారు. తప్పనిసరి బదిలీల్లో ఉన్న వారు అన్ని ఖాళీలనూ తప్పనిసరిగా ఆప్షన్ ఇచ్చుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. హెచ్ఎంలు జిల్లాకు 200 మంది వరకే ఉన్నందుకు ఇబ్బందుల్లేవని తెలిపారు. కానీ వేల సంఖ్యలో ఉన్న ఎస్జీటీలు మూడు, నాలుగు వేల ఆప్షన్లు ఇచ్చుకోవడం కష్టసాధ్యమని పేర్కొన్నారు. సీనియార్టీ జాబితాను విభజించి ప్రతి 500 మందికి ఒకరోజు చొప్పున కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. భార్యాభర్తలు, ఉపాధ్యాయులైతే జియో ట్యాగింగ్ ద్వారా 1 లేదా 2 సమీప పాఠశాలలు మాత్రమే చూపించి అవి మాత్రమే ఆప్షన్లుగా చూపిస్తోందని తెలిపారు. అవి పై ర్యాంకు వాళ్లు కూడా కోరుకుంటే, తప్పనిసరి బదిలీ జరిగే దంపతులు మరింత దూరం పోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఖాళీలు మండలం వారీగా చూపనందున వేర్వేరు మండలాల్లో ఒకే పేరుతో ఉన్న పాఠశాలలను ఎంచుకోవాల్సిన సమస్య వస్తోందని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాలని, వెబ్కౌన్సెలింగ్ను సమర్థవంతంగా జరపాలని డిమాండ్ చేశారు.
వెబ్కౌన్సెలింగ్ను రద్దు చేయాలి : ఎస్టీయూటీఎస్
లోపభూయిష్టమైన వెబ్కౌన్సెలింగ్ను రద్దు చేయాలని ఎస్టీయూటీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్టీయూటీఎస్ అధ్యక్షుడు బి భుజంగరావు, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు శనివారం హెచ్ఎం గ్రేడ్-2లకు తలెత్తిన అనేక సమస్యలను విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యను కలిసి విన్నవించామని తెలిపారు.
నేడు డీఈతో కార్యాలయాల వద్ద పీఆర్టీయూ ధర్నా
ఉపాధ్యాయ బదిలీల వెబ్కౌన్సెలింగ్ను రద్దు చేయాలని కోరుతూ పాత జిల్లాల్లో డీఈవో కార్యాలయాల వద్ద పీఆర్టీయూటీఎస్ ఆదివారం ధర్నా చేస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ఎప్పుడూ సీనియార్టీ జాబితాల్లో తప్పులు జరగలేదని పీఆర్టీయూటీఎస్ అధ్యక్షుడు పి సరోత్తంరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి చెన్నకేశవరెడ్డి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబితాల్లో తప్పులు సరిచేసిన తర్వాతే కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెబ్ఆప్షన్ల నమోదులో సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయని తెలిపారు.
లోపాలు సవరించాలి : పీఆర్టీయూ తెలంగాణ
ఉపాధ్యాయ బదిలీల్లో లోపాలను సవరించాలని పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షుడు ఎం అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం చెన్నయ్య డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రాల్లో వెబ్కౌన్సెలింగ్పై వచ్చే సమస్యలు పరిష్కరించడానికి హెల్ప్లైన్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పౌజ్ ఇద్దరు దీర్ఘకాలంగా పనిచేస్తున్నప్పటికీ జియో ట్యాగింగ్ ద్వారా కొన్ని స్థానాలను కాకుండా అన్ని స్థానాలనూ ఏర్పాటు చేయాలని సూచించారు. స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీలకు రెండు రోజులు వెబ్కౌన్సెలింగ్ సమయాన్ని మరో రెండు రోజులు పొడిగించాలని కోరారు. ఉపాధ్యాయుల వెబ్కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరుతూ ఆదివారం కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు ఉపాధ్యాయ ఐక్య వేదిక నాయకులు శంకర్, కిషన్నాయక్ తెలిపారు.