Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతాప్పై రాజయ్య గ్రూపు దాడి!
- రాళ్లురువ్విన కార్యకర్తలు
- ఇదంతా దేవస్థానం చైర్మెన్ పన్నాగమే !
- సీఎం దృష్టికి తీసుకెళ్తా: రాజారపు ప్రతాప్
నవతెలంగాణ-స్టేషన్ఘన్పూర్/చిల్పూర్
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ డివిజన్ చిల్పూర్ మండల కేంద్రంలో శనివారం టీఆర్ఎస్లో కుమ్ములాట జరిగింది. రాష్ట్ర నాయకులు రాజారపు ప్రతాప్ అనుచరులపై స్థానిక ఎమ్మెల్యే టి.రాజయ్య గ్రూపు కార్యకర్తలు దాడి చేసి రాళ్లు రువ్వారు. చిల్పూర్ దేవస్థానం చైర్మన్ మూలనాగరాజు పన్నాంగంతోనే ఈ దాడి జరిగిందని ప్రతాప్ గ్రూపువారు తీవ్ర విమర్శలు చేశారు.
నియోజకవర్గ కేంద్రంలో కొంతకాలంగా ప్రతాప్, ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నెలరోజుల కిందట అభివృద్ధి కార్యక్రమం సందర్భంగా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఫొటోలతో ప్రతాప్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని రాజయ్య గ్రూపు చించేసింది. వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలోనూ రాజారపు ప్రతాప్పై ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు చేశారు. ప్రతాప్ ఉత్తుత్తి నాయకుడే, ఆయనకు ఎలాంటి పదవీ లేదంటూ మాట్లాడారు. దీంతో ప్రతాప్ సమావేశం నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వం రైతులకు సబ్సిడీ కింద అందజేసిన ట్రాక్టర్ల పంపిణీలో ఏడు మండలాల్లో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డాడంటూ అనేక విమర్శలొచ్చాయి.
ఈ క్రమంలో ప్రతాప్ మంత్రి హరీశ్రావు, సీఎం కేసీఆర్ను కలిసి తన అనయాయులకు 17 ట్రాక్టర్లు మంజూరు చేయించుకున్నారు. వీటిని చిల్పూర్ దేవస్థానం వద్ద శనివారం పంపిణీ చేయనున్నట్టు ముందుగానే ప్రకటించారు. ముందుగా స్టేషన్ఘన్పూర్ సర్పంచులు, ఎంపీటీసీలు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగానే వారిపై రాళ్ల దాడి జరిగింది. చిల్పూరు గుట్టను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేసే విషయంలో ప్రతాప్ అడ్డుపడ్డారంటూ సభాస్థలికి రానీయకుండా రాళ్లతో దాడి చేశారు. ఇది దేవస్థాన చైర్మెన్ మూలనాగరాజు ఆధ్వర్యంలోనే జరిగినట్టు ప్రతాప్ అనుచరులు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్ల పంపిణీ అనంతరం రాజారపు ప్రతాప్ మాట్లాడుతూ.. ఈ దాడి కావాలనే ఎమ్మెల్యే రాజయ్య ఆడించిన డ్రామా అని ఆరోపించారు. తానూ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఇలా దాడులు చేయడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెెళ్తానని, కార్యకర్తలు అధైర్యపడొద్దని సూచించారు.