Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేసీబీని అడ్డుకున్న మహిళలు
- భూముల జోలికొస్తే ఊరుకోం.. : రైతులు
నవతెలంగాణ-మహాముత్తారం
ఇరవై ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు శనివారం ట్రెంచ్ పనులు చేపట్టారు. జేసీబీని మహిళలు అడ్డుకున్నారు. భూముల జొలికొస్తే పురుగుల మందుతాగి చస్తామని హెచ్చరించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు వెనుదిరిగారు.
జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం జీలపల్లి శివారులోని గిరిజనులు 20 ఏండ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. భూములను ఆధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. శనివారం పోడు భూముల్లో సరిహద్దు కందకాలు తీసేందుకు జీలపల్లి బీట్ అధికారిణి మాధవితో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది జేసీబీతో వచ్చారు. కందకాలు తీస్తుండగా మహిళలు అడ్డుకున్నారు. 20 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని, తమ జీవనాధారం అదేనని వేడుకున్నారు. అయినా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకుండా పనులు చేసే ప్రయత్నం చేశారు. చావనైనా చస్తాం కానీ భూములు వదులుకోబోమని ఓ మహిళ పురుగుల మందు తాగబోగా, ఫారెస్టు అధికారి అడ్డుకున్నారు. చివరకు జేసీబీని అక్కడే వదిలి ఫారెస్టు సిబ్బంది వెళ్లిపోయారు.