Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్లపల్లి జైలుకు ఐదుగురు ఉగ్రవాదుల తరలింపు
- జంట బాంబు పేలుళ్ల కేసు
నవ తెలంగాణ- ప్రత్యేక ప్రతినిధి
భద్రతా కారణాల దృష్ట్యా లుంబినీ పార్కు, గోకుల్చాట్ జంటబాంబు పేలుళ్ల కేసు విచారణను చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ప్రత్యేక ట్రయల్ కోర్టు నిర్వహించనుంది. మంగళవారం 26వ తేదీ నుంచి ఈ విచారణ స్పీడందుకోనుంది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న ఈ పేలుళ్లకు బాధ్యులుగా అరెస్టయిన ఐదుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఇసార్ అహ్మద్, అక్భర్, సిద్దిక్, అంజూమ్, అహ్మద్లను కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారం చర్లపల్లి జైలుకు తరలించి వారిని ప్రత్యేక బ్యారెక్లో ఉంచారు. 2007 ఆగస్టు 25వ తేదీన ట్యాంక్బండ్ లుంబినీ పార్కు, కోఠిలోని గోకుల్చాట్ బండార్లలో జరిగిన భారీ పేలుళ్లలో 48 మంది అమాయకులు మరణించగా, 87 మందికి పైగా క్షత గాత్రులయ్యారు. ఈకేసును మొదట నగరనేర పరిశోధక విభాగం, తర్వాత సిట్, అటు తర్వాత కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం దర్యాప్తు జరిపాయి. ఈ కేసులో ప్రధాన కుట్రదారుడుగా అనుమానిస్తున్న కర్నాటక వాసి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ ఇప్పటివరకు పోలీసులకు చిక్కలేదు. కాగా అతని సోదరుడు ఇక్భాల్ భత్కల్తో పాటు మరో పది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో భత్కల్ సోదరులపై ఇతర రాష్ట్రాలలో కేసుల విచారణ సాగుతున్నది. కాగా ఈ జంటపేలుళ్ల కేసుపై విచారణ జరుపుతున్న నాంపల్లి ప్రత్యేక విచారణ కోర్టు తన విధులను భద్రతా కారణాల దృష్ట్యా చర్లపల్లి జైలు ఆవరణలో సాగించేలా కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం హైకోర్టు నుంచి అనుమతిని పొందినట్టు తెలిసింది. ఇటీవల నాంపల్లి కోర్టులో మక్కామసీదు పేలుళ్ల కేసుకు సంబంధించిన హిందూ ఉగ్రవాద సంస్థకు చెందిన నిందితులను నిర్దోషులుగా తేల్చడం సంచలనం రేపింది. దీంతో కొన్ని ముస్లిం మైనారిటీ సంస్థలు ఈ తీర్పును వ్యతిరేకించగా, దర్యాప్తు జరిపిన ఎన్ఐఏ సంస్థ హైకోర్టులో అప్పీలు చేయనున్నట్టు ఆ సమయంలో తెలిపింది. కాగా ప్రస్తతం సాగుతున్న ఈ జంటబాంబు పేలుళ్ల కేసులో కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందోననే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ట్రయల్ కోర్టు విచారణ చర్లపల్లి జైలులో సాగేలా హైకోర్టు అనుమతిని తీసుకున్నట్టు తెలిసింది.