Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వాసితుల పోరాట కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 27న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయా ముందు ధర్నా నిర్వహించనున్నట్టు తెలంగాణ భూ నిర్వాసితుల పోరాట కమిటీ తెలిపింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిటీ రాష్ట్ర కన్వీనర్ బి. వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరుతో లక్షలాది ఎకరాలు భూమి సేకరిస్తున్నదని చెప్పారు. రైతులకు, నిర్వాసితులకు చట్ట ప్రకారం రావాల్సిన పరిహారం మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును న్యాయస్థానాలు తప్పుబట్టి చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని సూచించిందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కోర్టులనే తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను మార్పుకొని 2013 భూ సేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వాలని కోరారు.
భూమికి భూమితోపాటు డబుల్బెడ్ రూమ్ ఇండ్లు కట్టివ్వాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, పునరావాస ప్రాంతాల్లో విద్య, వైద్యం, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాసితులను భయపెట్టి అందోళనకు పూనుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ధర్నా కార్యక్రమాల్లో భూ నిర్వాసితులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్థిదారులు, చిరు వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో తెలంగాణ రైౖతు సంఘం రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు, గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మానాయక్ మాట్లాడారు.