Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు
- సబ్సిడీ నిధులు విడుదల చేయాలని డిమాండ్
- ఎస్వీకేలో రౌండ్టేబుల్ సమావేశం
నవతెలంగాణ - రాంనగర్
ఎస్సీల సంక్షేమం పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్బాబు విమర్శించారు. శనివారం హైదరాబాద్ నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ స్వయం ఉపాధి సబ్సిడీ రుణాల నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కేవీపీఎస్, డీబీఆర్సీ, ఎంఎస్ఎస్, డీబీఎఫ్ల సంయుక్త ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గడిచిన నాలుగేండ్లల్లో ప్రభుత్వం యువతీ, యువకులకు ఎలాంటి రుణాలిచ్చిన దాఖలాలు లేవన్నారు. రుణాలకు లబ్దిదారులను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీచేసినా నిధుల విడుదలలో అలసత్వం వహిస్తోందని అన్నారు.
డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు రుణాలందడం లేదన్నారు. పాలకుల తీరుపై హైకోర్టులో కేసు వేస్తే.. ఎస్సీ కార్పొరేషన్తో పాటు మిగతా కార్పొరేషన్లకు స్వయం ఉపాధి రుణాలు అందజేస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా కోర్టుకు తెలిపి నిధులు విడుదలకు హామీ ఇచ్చిందని చెప్పారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం ఉపాధి రుణాల జీవో జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వయం ఉపాధి విషయంలో ఎస్సీలకు అన్యాయం జరిగితే పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తుల రాంప్రసాద్, డీబీఆర్సీ కోఆర్డినేటర్ రఘుపతిరావు, స్పందన సంస్థ ప్రతినిధి ఇందిరా, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు ఎర్రమల రాములు తదితరులు పాల్గొన్నారు.