Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ కాంగ్రెస్ను ఓ వర్గమే ఏలుతోంది
- అక్కడ బీసీలకు ప్రాధాన్యత లేదు
- రాహుల్గాంధీకి చెప్పినా పార్టీలో మార్పులేదు :దానం నాగేందర్
- కేసీఆర్ది వైఎస్ఆర్ తరహా పాలన
- త్వరలో టీఆర్ఎస్లో చేరతా : మాజీ మంత్రి దానం నాగేందర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''నాలుగేండ్లుగా కాంగ్రెస్పార్టీలో అతికష్టం మీద కొనసాగుతున్నా....నా ప్రమేయం లేకుండా, నాకు తెలీకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారు...గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా 21 నియోజకవర్గాల జీహెచ్ఎంసీని స్వార్ధబుద్ధితో కొందరు కుదించే ప్రయత్నం చేశారు. దీనిపై అధిష్టానానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలా లేదు. కాంగ్రెస్లో బీసీలకు ప్రాధాన్యత లేదు. అది సహించలేకే ఆపార్టీ సీనియర్ నేతలు డీ శ్రీనివాస్, కే కేశవరావు వంటి నేతలు టీఆర్ఎస్లో చేరారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి ఇప్పుడు ఏంటి? వీ హనుమంతరావు వంటి నేతలు ఉన్నా...లేనట్టే...ఆయన మాట ఎక్కడా చెల్లుబాటయ్యే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితిని నాలుగేండ్ల క్రితమే గ్రహించి...నా కేడర్ను వారి తోవ వారిని చూసుకొమ్మని చెప్పా...దీంతో పలువురు మాజీ కార్పొరేటర్లు, పీపీసీ కార్యదర్శులతో పాటు అనేకమంది టీఆర్ఎస్లో చేరారు. వారినెవర్నీ నిలువరించలేదు..ఇక కాంగ్రెస్లో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్ధమైంది. ఆపార్టీ ఓ వర్గం చేతిలో నడుస్తోంది. అందుకే కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేశా. త్వరలో టీఆర్ఎస్లో చేరతా...అక్కడ ఏ పదవి, బాధ్యతలు ఇచ్చినా సమర్ధవంతంగా పనిచేస్తా...ఇవ్వకుంటే సామాన్య కార్యకర్తగా ఉండిపోతా'' ఇవీ మాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు దానం నాగేందర్ మాటలు. కాంగ్రెస్కు రాజీనామా చేశాక, తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సమావేశానికి గతంలో ఆయనతో కాంగ్రెస్లో కలిసి పనిచేసి, ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరిన గ్రేటర్ హైదరాబాద్ మాజీ కార్పొరేటర్లు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను కాంగ్రెస్పార్టీని వీడటానికి గల కారణాలను దానం నాగేందర్ సుదీర్ఘంగా మీడియాకు వివరించారు. కాంగ్రెస్ పార్టీని ఒకే వర్గానికి చెందిన వారు ఏలుతున్నారని, ఆత్మగౌరవం లేని చోట ఉన్నా...లేకున్నా ఒకటే అని స్పష్టం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పని చేశా. 30 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి సేవలందించా. ఒక సైనికుడిగా పని చేసినప్పటికీ.. చాకిరీ చేసే వాడిగానే వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలంతా అసంతప్తితో ఉన్నారని తెలిపారు. ఏ మీటింగ్ జరిగినా ఒకే వర్గానికి చెందిన వారు వేదిక మీద ఉంటారు. వారే మాట్లాడుతారు. బీసీలకు అవకాశం ఇవ్వరు.
రాహుల్కు చెప్పినా...ప్రయోజనం శూన్యం
ఆరు నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ బీసీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. ఆ మీటింగ్లో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించాను. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్కు సూచించా. ప్రతీ సారి బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆవేదనగా చెప్పా. అయినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. బీసీల పక్షాన మేం ఓ నివేదిక ఇస్తే...తెల్లారేసరికి ఓ వర్గం నేతలు మరో నివేదికను అధిష్టానానికి ఇస్తున్నారు. దీంతో పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకుండా పోతోంది అని చెప్పుకొచ్చారు.
నా ప్రమేయం లేకుండానే టికెట్లు ఇచ్చారు
'గతంలో జీహెచ్ఎంసీ అధ్యక్షుడిగా పని చేశాను. నా ప్రమేయం లేకుండానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు. అప్పుడే ఈ విషయాన్ని పీసీసీ దష్టికి తీసుకెళ్లాను. నా ఆవేదన పట్టించుకోలేదన్నారు. పార్టీ ప్రయోజనాల కోసం అప్పట్లో బహిరంగంగా చెప్పలేకపోయాను. కాంగ్రెస్లో బీసీలకు సరియైన గౌరవం ఇవ్వడం లేదు. ఇక ఆ పార్టీలో కొనసాగడానికి ఇష్టం లేదు. అందుకే కాంగ్రెస్కు రాజీనామా చేశాను' అని దానం స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సభల్లో 10 మంది ఒకే వర్గం వారుంటే.. అందులో ఒకరు మాత్రమే బీసీ నాయకుడు ఉంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ప్రేక్షకపాత్ర పోషించడం సరికాదని తమ వర్గానికి చెందిన కొంతమంది నాయకులు సూచించారు. అందుకే పార్టీని వీడాల్సి వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ రానందుకు రాజీనామా చేయట్లేదు అని స్పష్టం చేశారు.
వైఎస్ఆర్లా కేసీఆర్ పనిచేస్తున్నారు...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిలా రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కష్టపడుతున్నారని దానం నాగేందర్ ప్రసంసించారు. ఆయన తీసుకువచ్చిన 108, 104, రాజీవ్ ఆరోగ్య శ్రీ లాంటి ఎన్నో స్కీముల్ని విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల సంక్షేమం కోసం కళ్యాణలక్ష్మీ, గొర్రెల పంపకం, చేపల పంపకం వంటి అనేక పథకాల్ని కులాలవారీగా చేపడుతున్నారని చెప్పారు. కేసీఆర్ పథకాలు ప్రజల్లోకి చురుగ్గా వెళ్తున్నాయని, మంచి స్పందన ఉన్నదని చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ పార్టీ కోసం కష్టపడుతున్నారని, అయితే పార్టీలో ఉన్న కొందరు నేతలు ఇతర సామాజిక వర్గ నేతల్ని ఎదగనీయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.వార్తా పత్రికల్లో కాంగ్రెస్కు అనుకూలంగా వార్త వస్తే సీఎం అభ్యర్థులంతా ఢిల్లీకి పరుగెత్తుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో బీసీల జనాభా 1.67 కోట్లు. ఎన్నికలను ప్రభావితం చేయగలిగే శక్తి ఉన్నా... పార్టీ పదవుల్లో, అధికారాల్లో మాత్రం ప్రాధాన్యత లేదని దానం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన బస్సు యాత్రపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలకే బస్సుయాత్రలో ప్రాధాన్యమిచ్చారని, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్యకు ఆయన జిల్లా యాత్ర సమాచారం కూడా ఇవ్వకుండా అవమానించారని చెప్పారు.