Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం
- వచ్చే నెలలో బీసీ బహిరంగ సభ
- 112 బీసీ కుల సంఘాలతో జేఏసీ ఏర్పాటు
- బీఎల్ఎఫ్కు అభినందన : బీసీ సంఘాల సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాటా మాకు దక్కాల్సిందే..ఒక్క సర్పంచ్ స్థానం తగ్గినా రాష్ట్రంలో అగ్గి రాజేస్తాం.. వచ్చే సాధారణ ఎన్నికలో అధికార పార్టీకి తగిన బుద్ధి చెబుతాం.. అని బీసీ సంఘాల సమావేశంలో వక్తలు హెచ్చరించారు. జులై మొదటి వారంలో హైదరాబాద్లో బీసీ బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి బీసీ ''సెగ'' ఎంటో తెలియజేస్తామన్నారు. రిజర్వేషన్లలో న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు.. రిజర్వేషన్లలో గందరగోళం నేపథ్యంలో శనివారం హైదరాబాద్లోని ఇంజనీర్స్ భవన్లో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్యర్యంలో 112 బీసీ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 54 శాతానికి పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. 2014లో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలను వెల్లడించాలని కోరారు. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్న తరహాల్లోనే రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద రిజర్వేషన్లు వద్దని, జనాభా దామాషా ప్రకారం సామాజిక హక్కుగా రిజర్వేషన్లను అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. తమిళనాడు తరహాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అనేక సంద ర్భాల్లో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు స్థాని క సంస్థల ఎన్నికల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తప్పుల తడకగా జీవో
పంచాయతీరాజ్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 356 తప్పులు తడకగా ఉందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను గండి కొట్టే విధంగా పంచాయతీరాజ్ అధికారులు రిజర్వేషన్లను ఖరారు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 12,751 గ్రామ పంచాయతీలను యూనిట్గా తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేయాలని సూచించారు. ఒక్క సర్పంచ్ స్థానం తగ్గిన సహించబోమని హెచ్చరించారు. బీసీలను జాగృతం చేసేందుకు బస్సుయాత్ర నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. బీసీ మంత్రులు సీఎం కేసీఆర్కు నివేదించిన కమిటీ సిఫారసులను వెంటనే అమలు చేయాలన్నారు. బీఎల్ఎఫ్కు ప్రశంస...
వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు 65 శాసనసభ స్థానాలు, ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని ప్రకటించిన ''బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్'' కు శ్రీనివాస్గౌడ్ అభినందనలు తెలిపారు. బీసీల పట్ల బీఎల్ఎఫ్ తమ వైఖరి ఎంటో తెలియజేసిందని, అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చే సాధారణ ఎన్నికల్లో బీసీలకు ఎన్ని స్థానాలు కేటాయిస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు.
న్యాయం కోసం పోరాడుదాం
ఎంవి రమణ
రాజకీయాలకు అతీతంగా బీసీల న్యాయం కోసం పోరాడాలని కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి ఎవి రమణ పిలుపునిచ్చారు. బీసీ సమస్యల పరిష్కా రానికి సంఘాలన్నీ ఏకం కావాలని తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం బీసీల సంక్షేమాన్ని విస్మరించిందని విమర్శిం చారు. బీసీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు కోసం న్యాయ పోరాటం చేయాలని తెలిపారు. రిజర్వేషన్ల వర్గీకరణ అమ లు చేయ కపోవడం వల్ల అత్యంత వెనుకబడ్డ కులా లు రాజకీయాల కు దూరంగా ఉంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
జేఏసీ సమన్వయ కర్తగా
కుందారం గణేశ్
బీసీ రిజర్వేషన్లపై బీసీ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. దీనికి సమన్వయ కర్తగా కుందారం గణేశ్ను సంఘాల నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ మల్లయ్య. జయంతిరావు, బంగారు నర్సింహా, జి సుధాకర్, అంభాల రమణ, బెల్ల కృష్ణయాదవ్, బెల్లం రవి, పద్మ, కోల శ్రీనివాస్, పల్లపు భిక్షపతిరావు, బోయ గోపి, బాలకృష్ణ, ఎస్ దుర్గయ్య, విక్రంగౌడ్, తదితర నేతలు పాల్గొన్నారు.