Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాప్రమాణాల్లేవ్
- కొనసాగుతున్న అసమానతలు
- ఆర్టీఈతో అందరికీ అందుబాటులోకి చదువు
- గణితం ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు మరీ తక్కువ
- సర్కారుబడుల్లో 6 శాతం, ప్రయివేటు పాఠశాలల్లో 10 శాతం
- సెస్ అధ్యయనంలో పలు అంశాలు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో విద్యాప్రమాణాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. కొత్త రాష్ట్రంలోనూ విద్యారంగంలో అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) అమలు కావడంతో చదువు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా మాధ్యమిక విద్య చదివే పిల్లల సంఖ్య పెరిగింది. ఇంకోవైపు గణితం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంలో విద్యార్థులు తడబడుతున్నారు. గతంతో పోల్చితే సరైన సమాధానాలు చెప్పని విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. సెంటర్ ఫర్ ఎకనామిక్ సోషల్ స్టడీస్ (సెస్) అధ్యయనంలో పలు అంశాలు వెల్లడయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో విద్యాప్రమాణాలు, అభ్యసనం వంటి అంశాలకు సంబంధించి 2009 నుంచి 2016 వరకు మధ్య కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని యంగ్ లివ్స్ అనే సంస్థతో కలిసి సెస్ అధ్యయనం చేసింది. అనేక ఆసక్తికరమైన విషయాలను ప్రకటించింది. తెలంగాణలో విద్యాప్రమాణాలు మృగ్యమవుతున్నాయని తెలిపింది. అందరికీ చదువు అందుబాటులోకి వచ్చినా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని నివేదికలో పేర్కొంది.
పెరిగిన బడిలో చేరే విద్యార్థుల సంఖ్య
ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ)-2009 అమల్లోకి వచ్చిన తర్వాత బడిలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. 15 ఏండ్ల పిల్లలు 2009లో 76 శాతం మంది బడిలో చేరితే, 2016లో 92 శాతానికి పెరిగారు. ముఖ్యంగా గిరిజన విద్యార్థులు బడులకు వెళ్లడంలో గణనీయమైన మార్పు వచ్చింది. 15 ఏండ్ల గిరిజన బాలికలు 2009లో 70 మంది బడులకు వెళ్తే 2016లో 89 శాతానికి చేరారు. 15 ఏండ్ల గిరిజన బాలురు 2009లో 61 శాతం మంది బడుల్లో చేరితే 2016లో 93 శాతానికి పెరిగారు. గణితం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పే వారి సంఖ్య మరీ తక్కువగా ఉన్నది. సర్కారు బడుల్లో 6 శాతం మంది, ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు పది శాతం మాత్రమే సరైన సమాధానాలు చెప్తున్నారు. గణిత అభ్యసనంలో విద్యార్థుల ప్రమాణాలు 2009తో పోల్చితే 2016కు మెరుగుపడలేదు. గణితం ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పే వారి సంఖ్య ప్రయివేటు పాఠశాలల్లో 2009లో 16 శాతం ఉంటే, 2016లో పది శాతానికి పడిపోయారు. ఆర్టీఈ అమల్లోకి వచ్చాక 1 నుంచి 8వ తరగతిలోపు చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2015-16 విద్యాసంవత్సరంలో ప్రాథమిక విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) 97 శాతం నమోదైంది. ఈ గణాంకాలే భారతదేశంలో విద్యాహక్కు చట్టం సమర్థంగా అమలవుతోందనడానికి నిదర్శనమని నివేదికలో పేర్కొంది. విద్యార్థులు ప్రాథమిక విద్యను పూర్తి చేస్తున్నారు. మాధ్యమిక విద్యలో చేరేవారి సంఖ్య పెరుగుతున్నది. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఏ) ద్వారా విద్యార్థుల నివాసాలకు అందుబాటులోనే పాఠశాలలను నెలకొల్పింది. తెలంగాణలో 2015-16 విద్యాసంవత్సరంలో మాధ్యమిక విద్యలో జీఈఆర్ 83 శాతం మంది చేరారు.
ప్రయివేటు బడులకు వెళ్లినా తప్పని ట్యూషన్లు
ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులూ ట్యూషన్లకు వెళ్లడం తప్పడం లేదు. ప్రయివేటు బడుల్లో చదువుతున్న 15 ఏండ్ల వయస్సున్న విద్యార్థులు 2009లో 33 శాతం మంది ట్యూషన్లకు వెళ్తే, 2016లో 40 శాతానికి పెరిగారు. ప్రయివేటు బడుల్లో ఫీజులతోపాటు ట్యూషన్ల ఖర్చు పెరుగుతున్నది. దీంతో ప్రయివేటు బడుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నదని సెస్ నివేదికలో తెలిపింది. ప్రభుత్వ బడులకు వెళ్తున్న విద్యార్థుల్లో రెండు శాతం కంటే తక్కువ మంది ట్యూషన్లకు వెళ్తున్నారు. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులు 82 శాతం మంది చదువుతున్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం తక్కువగా ఉంటున్నది. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రమాణాలు గణితం అభ్యసనంలో తక్కువ ఉంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల అభ్యసన స్థాయి మరింత దయనీయంగా మారింది. ఇతర విద్యార్థులతో పోల్చితే ఎస్సీ విద్యార్థుల అభ్యసనం తక్కువగా ఉందని ఎన్సీఈఆర్టీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో వెల్లడించింది. అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతోందని సెస్ అధ్యయనంలో ప్రకటించింది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల అభ్యసనం స్థాయిలను పెంచాలంటే ఉపాధ్యాయులు జవాబుదారీతనంతోపాటు అంకితభావంతో పనిచేయాలని సూచించింది. అప్పుడే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి వీలవుతుంది. అట్టడుగున ఉన్న విద్యార్థుల చదువులపై దృష్టి కేంద్రీకరించడానికి అవకాశముంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పేద తల్లిదండ్రులు నిరక్షరాస్యులుగా ఉన్నారు. నివాస ప్రాంతాల్లో వారి పిల్లలు చదువుకునేలా శ్రద్ధ తీసుకునే అవకాశం లేదు. అందుకే ఉపాధ్యాయులు పాఠశాలల్లోనూ, బయట విద్యార్థులకు చదువు నేర్పించడంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరముంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంతోపాటు ప్రాథమిక విద్య పునాది నుంచే చదువుపై ఆసక్తి పెరుగుతుంది. పునాది విద్య బలహీనంగా ఉండడంతో మాధ్యమిక విద్య, పై చదువులకు వచ్చినా విద్యపై ఆ విద్యార్థులు సరిగ్గా శ్రద్ధ చూపడం లేదు. వివిధ కోర్సుల్లో డిగ్రీ పట్టాలు పొందుతున్నా నైపుణ్యం లేక ఉపాధి అవకాశాలకు దూరమవుతున్నారు.