Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏసీబీ కేసుల వ్యవహారంపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఏసీబీ కేసుల నమోదు విషయంలో విధివిధానాలు మార్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో అన్నారు. ఉన్నతాధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చిన సందర్భంలో వారికి నోటీసులు ఇచ్చి వివరణ కోరిన మీదట చర్యలు తీసుకుంటే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న మచ్చలేని ఉన్నతాధికారులపై గిట్టని వారు కావాలని చేసే ఫిర్యాదుతో ఆ అధికారులతోపాటు ప్రభుత్వానికి నష్టం జరుగుతుందన్నారు. కృష్ణా బేసిన్ చీఫ్ ఇంజనీర్ సురేష్కుమార్పై ఏసీబీ కేసు నమోదు చేయడం ఈ కోవకు చెందినదేనన్నారు. అమాయకులకు నష్టం కలగకుండా ఏసీబీ చట్టానికి ఎటువంటి సవరణలు చేయాలనే దానిపై కెేసీఆర్ గవర్నర్తో చర్చించారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్కు వచ్చిన ముఖ్యమంత్రి...గంటకు పైగా గవర్నర్తో భేటీ అయ్యారు. నాలుగో విడత హరితహారం, బీసీ స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించినట్టు సమాచారం. హరితహారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ను ఆహ్వానించారు. సంచార జాతులను బీసీ జాబితాలో చేర్చడం వంటి ప్రతిపాదనలను కూడా గవర్నర్కు సీఎం వివరించినట్టు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లు శాసనసభ్యత్వాల రద్దు విషయంలో శాసనసభ కార్యదర్శి హైకోర్టు ధిక్కార నోటీసులు అందుకున్న అంశం, పంచాయితీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు, కళాకారులను ఉద్యోగాల నుంచి తొలగించాలని హైకోర్టు ఆదేశాలు, రైతుబంధు పథకంపై హైకోర్టుకు ప్రభుత్వ వివరణ, కేంద్రం పరిధిలోని పెండింగ్ అంశాలు, విభజన చట్టం హామీల అమలులో కేంద్రం జాప్యం, శాసనసభ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.