Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్ల మేలు కోసమే హెకీ
- కేంద్రం పెత్తనం పెరిగే ప్రమాదం
- వర్సిటీలపై మితిమీరనున్న రాజకీయ జోక్యం
- అధికార పార్టీ కనుసన్నల్లో నిధులు
- అకడమిషియన్స్ నుంచి బ్యూరోక్రాట్లకు అధికారం
- ఉన్నత చదువులకు పేదలు దూరం
- అన్ని వర్గాల నుంచీ పెల్లుబికిన వ్యతిరేకత
* బి. జగదీశ్వర్
దేశంలోనే ప్రతిష్టాతకమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రద్దు చేస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటనపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది. నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాక విద్యారంగం ఇప్పటికే ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ, వ్యాపారీకరణ అయ్యిందని నిపుణులు చెప్తున్నారు. తాజాగా యూజీసీపై వేటు వేయడం విద్యారంగాన్ని మరింత ప్రయివేటుపరం చేసేందుకేనన్న అభిప్రాయం వినిపిస్తున్నది. కార్పొరేట్ శక్తులకు మేలు చేయడం, ప్రయివేటు రంగాన్ని విస్తరించడం కోసం అడ్డంగా ఉన్న నిబంధనలు మార్చడం కోసమే భారత ఉన్నత విద్యా కమిషన్ (హెకీ)ని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూజీసీ ఇప్పటి వరకు అకడమిషియన్ల ఆధీనంలో పనిచేస్తూ వచ్చింది. కేంద్రంలో అధికారం ఏ పార్టీ చేపట్టినా రాజకీయ జోక్యం తక్కువగా ఉండేది. విశ్వవిద్యాలయాలు, కాలేజీలకు నిధులు మంజూరు చేసే అధికారం యూజీసీకి ఉండేది. నిబంధనలు అతిక్రమించిన విద్యాసంస్థలను నియంత్రించే అధికారం మాత్రం యూజీసీకి
లేదు. కొత్తగా హెకీ అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వం పెత్తనం పెరిగే ప్రమాదముంది. విశ్వవిద్యాలయాలు, కాలేజీలపై రాజకీయ జోక్యం పెరుగుతుందని కొందరు అధికారులే వాపోతున్నారు. నిధులు ఇచ్చే అధికారం ఇక నుంచి హెకీ కాకుండా ఎంహెచ్ఆర్డీ చూసుకుంటుంది. అంటే ఎంహెచ్ఆర్డీ కనుసన్నల్లోనే నిధుల కేటాయింపు ఉంటుంది. విశ్వవిద్యాలయాలు, కాలేజీలను హెకీ నియంత్రిస్తుంది. యూజీసీకి ఇప్పటి వరకు ఉన్న స్వయంప్రతిపత్తి హెకీ ఉంటుందా?అన్నది ప్రశ్నార్ధకమే.
పెరగనున్న అధికారుల పెత్తనం
యూజీసీలో ఇప్పటి వరకు అకడమిషియన్లు అధికారం చెలాయించేవారు. కొత్తగా హెకీ వస్తే అధికారులు (బ్యూరోక్రాట్ల) పెత్తనం పెరిగే ప్రమాదముంది. హెకీకి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఉంటారు. క్యాబినెట్ కార్యదర్శి, ఎంహెచ్ఆర్డీ కార్యదర్శి కూడా ఉంటారు. పనిచేస్తున్న విశ్వవిద్యాలయాలకు చెందిన ఇద్దరు వీసీలు, ఓ పారిశ్రామికవేత్త, ఇద్దరు ప్రొఫెసర్ల చొప్పున మొత్తం 14 మంది ఈ కమిటీలో ఉంటారు. నిర్ణయాధికారమంతా అధికారులకే ఉంటుంది. ఓ శాఖకు ఉన్నతాధికారి కనీసం రెండేండ్ల వరకు ఆ పదవిలో ఉంటారు. ఆ తర్వాత ఇంకో అధికారి వస్తారు. అధికారి మారినప్పుడల్లా నిర్ణయాలు మారే అవకాశముంది. అకడమిషియన్లు ఎప్పటి నుంచో విద్యారంగంలోనే ఉంటారు. విద్యారంగంపై వారి అధ్యయనం ఉంటుంది. దేశ, విదేశాల్లో జరిగే పరిణామాలపై అకడమిషియన్లకు అవగాహన ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇంకోవైపు హెకీని మార్గదర్శనం చేసేందుకు సలహాసంఘం ఉంటుంది. ఆయా రాష్ట్రాల ఉన్నత విద్యామండలి నుంచి ఒకరిని సభ్యులుగా ఉంటారు. సలహాసంఘానికి అధ్యక్షులుగా ఎంహెచ్ఆర్డీ మంత్రి ఉంటారు. అంటే సలహాసంఘంపై కేంద్రం పెత్తనం పెరిగే ప్రమాదముంది. ప్రభుత్వరంగ విద్యాసంస్థల పట్ల హెకీ కఠినంగా ఉండి, ప్రయివేటు విద్యాసంస్థల పట్ల ఉదారంగా ఉండే అవకాశముంది. హెకీ సభ్యుడుగా ఓ పారిశ్రామికవేత్తకు చోటు కల్పించడమంటేనే కార్పొరేట్లకు మరింత మేలు చేయడం కోసమేనని అర్థమవుతున్నది. ఇది విద్యా ప్రయివేటీకరణకు దారితీస్తుంది. విద్యారంగం ప్రయివేటుపరమైతే పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదముంది. ప్రభుత్వ రంగ విశ్వవిద్యాలయాలు మరింత నిర్లక్ష్యానికి గురవుతారని ఆందోళన వ్యక్తమవుతున్నది.
నచ్చిన పరిశోధనలకే నిధులు
కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల్లో 60 శాతం నలభైకి పైగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు, 30 శాతం నిధులు 380కిపైగా ఉన్న రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, మిగిలిన 10 శాతం నిధులు కాలేజీలకు వెళ్తున్నాయి. నిధుల పరంగా ఇప్పటికే రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. హెకీ అమల్లోకి వస్తే నిధులు మరింత కేంద్రీకరణ అయ్యే ప్రమాదముంది. నచ్చిన విశ్వవిద్యాలయాలు, నచ్చిన పరిశోధనలకే నిధులు కేటాయించే అవకాశముంది. జ్యోతిష్యం, యోగా, మూఢవిశ్వాసాలను పెంచే అంశాలకు బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చే ప్రమాదం లేకపోలేదు. మతతత్వ భావాలు, హిందూత్వ భావాలు పెంచేలా పరిశోధనలు చేయాలని విద్యార్థులపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. ఒకవేళ దళితులు, మైనార్టీలు, బలహీనవర్గాల విద్యార్థులు శాస్త్రీయ దృక్పధం పెంపొందించే అంశాలు, జాతీయ సమైక్యత, ఆధునిక కాలంలో సాంకేతిక విప్లవం వంటి అంశాలపై పరిశోధనలు చేస్తే వాటిని నిర్లక్ష్యం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో విశ్వవిద్యాలయాలపై వామపక్ష, అంబేద్కర్, దళిత విద్యార్థి సంఘాలు బలంగా ఉన్నాయి. హిందూత్వ భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు అడ్డుగా ఉన్నాయి. రాజకీయ జోక్యం చేసుకునేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రోహిత్ వేముల మరణం వంటి ఘటనలు జరిగితే ఆ ఉద్యమాలను కూకటివేళ్లతో పెకిలించే అవకాశం అధికార పార్టీకి ఉండడం లేదు. ఇవన్నీ కారణాల రీత్యా ప్రయివేటు విద్యారంగాన్ని ప్రోత్సహించడమే కాకుండా మతతత్వ భావాలను వ్యాప్తి చేయడంలో భాగంగా హెకీని అమల్లోకి తెస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఇంకోవైపు ఏదైనా ఓ సంస్థను రద్దుచేసి కొత్త విధానాన్ని తేవాలని భావించినపుడు నిపుణులతో ఓ కమిటీ లేదా కమిషన్ వేసి విస్తతృంగా అభిప్రాయాలు సేకరించి నిర్ణయం తీసుకోవాలి. కానీ బీజేపీ ప్రభుత్వం ఆ విధానాన్ని తుంగలో తొక్కి యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో హెకీకి తెస్తున్నామని ముసాయిదా బిల్లును వెబ్సైట్లో ఉంచడం అప్రజాస్వామికమని నిపుణులు అంటున్నారు. హెకీపై అభిప్రాయాలు చెప్పేందుకు ఈనెల 20వ తేదీ వరకు గడువుంది.
తెలంగాణ దారెటు?
యూజీసీ రద్దు హెకీ అమల్లోకి తేవడంపై విశ్వవిద్యాలయాల వీసీలు, విద్యారంగా నిపుణులు, ఉన్నత విద్యామండలి అధికారులతో సోమవారం హైదరాబాద్లోని అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలు యూజీసీ రద్దును తప్పుపట్టాయి. హెకీ అమల్లోకి తేవడాన్ని వ్యతిరేకించాయి. యూజీసీ రద్దు పట్ల తెలంగాణ దారెటు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు కేంద్రం చేసిన నిర్ణయాలను వ్యతిరేకించని టీఆర్ఎస్ ప్రభుత్వం హెకీని వ్యతిరేకిస్తుందా?అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. గతంలో పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అధికార టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు తరహాలో వ్యతిరేకిస్తుందా? లేక షరామామూలుగా సమర్థిస్తుందా?అన్నది వేచిచూడాల్సిందే.