Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఎల్ఎఫ్ రాష్ట్ర సదస్సులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- ఎన్నికల విధానాల్లో మార్పులు అవసరం
- ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్స్ అనుసంధానం చేయాలి
- ఆర్ఎస్ఎస్ కొరుకున్న విధంగా దేశాన్ని మార్చే కుట్ర
- ప్రజానీకంపై ఆర్థిక, సామాజిక దాడులు
- రాష్ట్రంలో నీల్,లాల్ ఐక్యత దేశానికి మార్గదర్శకం
- బహుజన రాజ్యాధికారంతోనే సమస్యలు పరిష్కారం బీఎల్ఎఫ్ రాష్ట్ర సదస్సులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
- శంషాబాద్ నుంచి ఎస్వీకే వరకూ భారీ ర్యాలీ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు విరాళాలు ఇచ్చే విధానాన్ని నిషేధించాలని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల విధానంలో అనేక సంస్కరణలు చేశారనీ, అవి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకే మేలు చేసేలా ఉన్నాయని విమర్శించారు. గతంలో కార్పొరేట్ సంస్థలు వాటి లాభాల్లో ఏడు శాతం రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చే నిబందన ఉండేదనీ, కానీ మోడీ అధికారంలోకి వచ్చాక, ఆ నిబంధన ఎత్తివేశారని చెప్పారు. కార్పొరేట్ సంస్థలు రాజకీయ పార్టీలకు ఎంతైనా విరాళాలు ఇవ్వొచ్చని, ఏ పార్టీకి ఇచ్చారనే విషయాన్ని కూడా ఆ సంస్థలు చెప్పాల్సిన అవసరం లేకుండా సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. కార్పొరేట్ సంస్థలు నేరుగా ఎన్నికల కమిషన్కే విరాళాలు ఇవ్వాలని, వాటిని అన్ని రాజకీయ పార్టీలకు ఓట్ల ఆధారంగా ఎన్నికల ప్రచార సామగ్రిరూపంలో అందివ్వాలని సూచించారు. ఈవీఎంలపై అనేక ఆరోపణలు వస్తున్నాయనీ, కాబట్టి ఈవీఎంలకు ప్రింటింగ్ మిషన్స్ కూడా ఏర్పాటు చేయాలనీ, తద్వారా ఓటు ఎవరికి పడిందో తెలుసుకునే వీలు కల్పించే అవకాశం కల్పించాలని కోరారు. రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల ఆధారంగా ప్రభుత్వంలో స్థానం కల్పించాలన్నారు. దేశంలో బహుజన లెఫ్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తుందని స్పష్టం చేశారు.
ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఆధ్వర్యంలో 'ఎన్నికల సంస్కరణలు- ఆవశ్యకత, తెలంగాణలో బహుజన ప్రభుత్వం- ఓటరు పాత్ర' అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. బీఎల్ఎఫ్ రాష్ట్ర చైర్మెన్ నల్లా సూర్యప్రకాశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా అంబేద్కర్, కారల్ మార్క్స్, జ్యోతిబాపులే, సావిత్రిబాయిపులే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏచూరి మాట్లాడుతూ...మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఆర్థిక, సామాజిక , మతోన్మాద దాడులు పెరిగాయని అన్నారు. సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, విద్యారంగం...ఇలా అన్నింటిలోనూ ఇటీవల జరిగిన పరిణామాలు వాటిని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో కొనసాగుతున్న త్రిమూర్తి విధానాలు.. త్రిశూలం కిందికి మారుతున్నాయని విమర్శించారు. దేశ చరిత్రను మార్చే కుట్ర జరుగుతున్నదనీ, ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో ప్రభుత్వాన్ని మార్చడం అనివార్యమని అన్నారు. ఇటీవల రైతులకు కేంద్రం మద్దతుధర ప్రకటించినా, అది ఖర్చు కంటే చాలా తక్కువని చెప్పారు. రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు దేశంలోని రైతుల రుణాలను మాఫీ చేయాలంటూ అన్ని రాష్ట్రాల్లో ఆందోళనలు జరుగుతున్నా, ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కానీ కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలకు బ్యాంకు రుణాల కింద ఇచ్చిన రూ.3.50లక్షల కోట్లను మాఫీ చేశారని విమర్శించారు. కొందరు కార్పొరేట్, బడా నేతలు అప్పలు చెల్లించకుండా విదేశాలు పోతున్నా..పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో రూ.11లక్షల కోట్లను పెట్టుబడిదారులకు అప్పులిచ్చారని, వాటిలో సగం వసూలు చేసినా ఎన్నోసంస్థలను ప్రభుత్వమే స్థాపించవచ్చని, తద్వారా లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని చెప్పారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రధాని మోడీ..గడిచిన నాలుగేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రయివేటీకరణతో విద్యా,వైద్యం సామాన్య ప్రజలకూ దూరమవుతున్నాయని అన్నారు. వీటి పరిరక్షణకు ప్రత్యామ్నాయ విధానాలతో కూడిన రాజకీయాలు అవసరమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోడీ వస్తారా..? రాహుల్ గాంధీ వస్తారా అనే చర్చ జరుగుతున్నదని, ఇది అనవసరమనీ, దేశానికి నేతలు ముఖ్యం కాదని, విదానాలు ముఖ్యమని స్పష్టం చేశారు. ఆవు పేరుతో దేశంలో ముస్లీములు, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయనీ, మరోపక్క మహిళలపై, చిన్నారులపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యూపీలో బీజేపీ ఎమ్మెల్యేపై లైంగిక దాడి కేసులో చార్జిషీటు దాఖలైనా ఇప్పటికీ ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ముస్లిం దేశంగా ఉన్న పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అబ్దుల్ హమీద్కు పరమవీర చక్ర అవార్డు లభించిందని గుర్తుచేశారు.
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర..
స్వతంత్య్ర సంస్థల్లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోతున్నదని ఏచూరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇటీవల మాజీ ఎన్నికల కమిషనర్లందరూ ప్రస్తుతమున్న ఎన్నికల కమిషనర్ను కలిశారని చెప్పారు. కమిషన్ స్వతంత్రతను కాపాడేలా వ్యవహరించాలంటూ సూచించారని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. యూనివర్సిటీలకు మార్గదర్శకంగా ఉన్న యూజీసీ సంస్థను మూసివేసి, బీజేపీ తమకు అనుకూలమైన విధానాలతో మరో సంస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్న విధంగా దేశాన్ని మార్చేందుకు కుట్ర జరుగుతున్నదనీ, దీనిలో భాగంగానే రాజ్యాంగాన్ని మార్చాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. ప్రజల్ని మూఢనమ్మకాల వైపు తీసుకుపోయేందుకు పురణాలను ఉపయోగించుకుంటున్నారని అన్నారు. కులం, మతం పేర దేశాన్ని చీల్చే కుట్ర జరుగుతున్నదని, రాజకీయ స్వార్థం కోసం ప్రజల్లో చిచ్చుపెడుతున్నారని తెలిపారు.
బీఎల్ఎఫ్ దేశానికి మార్గదర్శకం..
దేశంలోని 90శాతం మంది ఆర్థిక, సామాజిక దోపి డీకి గురవుతున్నారనీ ఏచూరి తెలిపారు. సామాజిక న్యాయం అనేది జాలితో కూడుకున్నది కాదనీ, అది అధి కారమని అన్నారు. అన్ని రంగాల్లో వెనుకబడిందనే కార ణంతో తెలంగాణ కోసం ఆందోళనలు జరిగాయనీ, ప్రస్తుతం తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రరజల జీవి తాల్లో ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఇంకా వెనకబడే ఉన్నారన్నారు. రాజకీ యరంగంలో మార్పు బీఎల్ఎఫ్ ద్వారా సాధ్య మవు తుందని అన్నారు. తద్వారా వెనకబడిన కులాలు అభివృద్ధి చెందే అవకాశముందని తెలిపారు. తెలంగా ణలో నీల్, లాల్ ఐక్యత నినాదం దేశవ్యాప్తంగా ప్రభావం చూపిందని సీతారాం ఏచూరి అన్నారు. బీఎల్ఎఫ్ ఇంత ప్రభావం చూపిస్తుందనీ తాను కూడా ఊహించలే నన్నారు. కాగా ఉదయం హైదరాబాద్కు వచ్చిన సీతారాం ఏచూరికి శంషాబాద్ విమానాశ్రయంలో బీఎల్ఎఫ్ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకూ కార్లు, ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. బాగ్లింగం పల్లిలో బతుకమ్మలు, బోనాలతో మహిళలు స్వాగతం పలికారు. ఈ సదస్సులో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యు లు చెరుపల్లి సీతారాములు, బీఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్లు మజీదుల్లా ఖాన్(ఎంబీటీ), వైస్ చైర్మెన్లు వేముల ఆనంద్ కుమార్, జలజం సత్యనారాయణ, భరత్ వాగ్మారే, జి రాములు, గుజ్జ రమేశ్, పటేల్ వనజ, ప్రచార కమిటీ కన్వీ నర్ హిమబిందు, బీఎల్ఎఫ్ కన్వీనర్లు మద్దికాయల అశోక్, జానకిరాములు, జి నాగయ్య, జాన్వెస్లీ, విక్రం కుమా ర్, మన్నారం నాగరాజు, శ్రీనివాస్ బహదూర్, చంద్ర మౌళి, మాస్టార్జీ, టీవీ రామనర్సయ్య, కృష్ణస్వామి, సుబ్బారావు, ప్రచార కమిటీ సభ్యులు రేఖ, సౌజన్య పాల్గొన్నారు.
భూమిలేని వారికీ రూ.లక్ష రుణాలివ్వాలి: కంచ ఐలయ్య
ప్రభుత్వం కేవలం భూమి ఉన్న రైతులకే రుణాలిస్తున్నదనీ, కానీ భూమిలేని వ్యవసాయ కార్మికులకు, కూలీలకు కూడా రూ.లక్ష రుణం ఇవ్వాలని టీమాస్ చైర్మెన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య కోరారు. టీమాస్ ప్రతిపాదనలను, బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే అమలు చేయాలని, ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. రైతుబంధు పథకం పేరుతో భూస్వాములకూ లక్షల రూపాయలను ఇచ్చారనీ, కానీ ఆ భూమిని వాస్తవంగా సాగుచేస్తున్న కౌలురైతులకు మాత్రం ఎలాంటి సహాయం చేయలేదని అన్నారు. ఇప్పటికీ ఏ పార్టీ కూడా బీసీలకు 39 సీట్లకు మించి సీట్లు కేటాయించలేదనీ, బీఎల్ఎఫ్ 65సీట్లతో పాటు ముఖ్యమంత్రి పదవిని ఇస్తామని చెప్పడం హర్షనీయమన్నారు. బీఎల్ఎఫ్ ఏర్పాటుతో రాష్ట్రంలో కొత్త వాతావరణం ఏర్పడిందని చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుంది: గద్దర్
ఇప్పటి వరకూ తనకు ఓటు లేదనీ, త్వరలోనే నమోదు చేసుకుంటానని ప్రజాగాయకులు గద్దర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనిపిస్తున్నదని ఆయన తన మనసులోని మాటను బయటపెట్టారు. ఒక్క ఓటు రాజకీయ సమానత్వం కోసం, పోరాట రూపంగా మారబోతున్నదని చెప్పారు. ఎర్రజెండాకు నీల్జెండా తోడుంటే సమానత్వం వస్తుందన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య కాలం నాటి పరిస్థితులు నేడు లేవని, నూతన పార్లమెంట్ విధానం రావాల్సి ఉందని అన్నారు. నేపాల్లో ఎర్రజెండా పార్టీలను ఏకం చేసిన సీతారాం ఏచూరి,దేశంలోని వామపక్షాలనూ ఐక్యం చేయాలని కోరారు. బీఎల్ఎఫ్కు తాను ఎల్లవేళలా మద్దతుగా ఉంటానని చెప్పారు.
బువ్వ కేంద్రాలను పెట్టి చూపిస్తాం : తమ్మినేని
బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని 14వేల గ్రామాలకు అనుసంధానంగా పదివేల బహుజన బువ్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి, బీఎల్ఎఫ్ కన్వీనర్ తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఉదయం మూడు రూపాయలతో టిఫిన్, మధ్యాహ్నం ఐదు రూపాయలతో భోజనం పెట్టాలని, ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలని కోరారు. ఈ పథకాన్ని కేవలం రూ.11వేల కోట్లతో ఏడాది పాటు నిర్వహించవచ్చని స్పష్టం చేశారు. త్వరలోనే ఒక గ్రామాన్ని మోడల్గా ఎంచుకుని, ఈ పథకాన్ని అమలు చేసి చూపిస్తామని చెప్పారు. ఇది జాలి పథకం కాదనీ, వర్గపోరాటాల పథకమనీ, ప్రజల్లో చైతన్యం రగిల్చే పథకమమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పోటీ చేస్తానని చెప్పిన గద్దర్కు బీఎల్ఎఫ్ అండగా ఉండి, చట్టసభల్లోకి పంపించే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో ఎర్రజెండా పార్టీలను కలిపేందుకు బీఎల్ఎఫ్ ప్రయత్నిస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయంగా అన్ని పార్టీలనూ కలుపుకొని పోతామని చెప్పారు. ఇటీవల జరిగిన వామపక్షాల సమావేశంలో వేరే ఫ్రంట్లను ఏర్పాటు చేసే ఆలోచన లేదని అన్ని పార్టీలు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. టీమాస్ రూపొందించిన విధానాలను బీఎల్ఎఫ్ అమలు చేస్తుందని చెప్పారు. ఓటు చైతన్య కోసం అన్ని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తామన్నారు.