Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచస్థాయి జీడీపీ వృద్ధిరేటుతో దూసుకుపోగలమా..?
- మహిళల రక్షణలో అథమ స్థానంలో ఉన్నారంటూ భారత్కు పలు అంతర్జాతీయ నివేదికల్లో హెచ్చరిక
నవతెలంగాణ, జనరల్డెస్క్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం గర్వంగా చెప్పుకుంటాం. అంబేద్కర్ చేతుల మీదుగా రూపు దిద్దుకున్న మన రాజ్యాంగపు ఔన్యత్యాన్ని ఘనంగా చాటుకుంటాం. కానీ, రాజ్యాంగం హామీ ఇచ్చిన సమానత్వం, స్వేచ్ఛను ఏమేరకు అమలు చేస్తున్నామన్నదే అసలు ప్రశ్న. ఘనకీర్తి గల భారత్లో మహిళలు, బాలికల రక్షణ పట్ల ఇక్కడి ప్రభుత్వాలు తగినంత శ్రద్ధ తీసుకోవడంలేదని పలు ప్రపంచ నివేదికల్లో వెల్లడి కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఓవైపు పాఠశాలలు, కళాశాలల్లో బాలికల సంఖ్య పెరుగుతున్నా శ్రమశక్తిలో మహిళల భాగస్వామ్యం 27 శాతానికే పరిమితమైందని ఇండియా స్పెండ్ నివేదిక తాజాగా వెల్లడించింది. భారత ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం అతి తక్కువగా ఉన్నట్టు మెక్కిన్సే అధ్యయనంలో వెల్లడైంది. మన జీడీపీలో మహిళల వాటా 17 శాతమేనని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ సగటు 37 శాతం కన్నా అది చాలా తక్కువ. శ్రమశక్తిలో పురుషులు, మహిళల మధ్య అంతరాన్ని తొలగించుకోవాలని ఆ నివేదిక సూచించింది.
విద్య, ఉద్యోగాల్లో వివక్ష సంగతి అలా ఉంటే కనీసం వారికి గౌరవప్రదమైన జీవితమైనా మన సమాజంలో లభిస్తుందా.? అన్నదే ప్రశ్న. ఐదేండ్లలోపు చిన్నారులపై లైంగిక దాడులు జరుగుతున్నట్టు దేశంలోని ఏదో ఒకచోట నుంచి ప్రతిరోజూ వార్తలు వస్తున్నాయి. థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో మహిళల రక్షణలో ఇండియాకు ప్రపంచంలోనే అట్టడుగు స్థానం దక్కింది. అంటే మహిళలపై లైంగిక దాడులు అత్యధికంగా జరుగుతున్న దేశంగా రికార్డులకెక్కింది. ఆడ శిశువుల్ని పిండదశలోనే హతమారుస్తున్న ఘటనలూ ఇక్కడే అధికంగా ఉన్నాయి. దాంతో, మహిళల జనాభా ఏటేటా తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రతిపాదన దశాబ్దాలుగా పార్లమెంట్ సాక్షిగా అటకెక్కి కూర్చుంది. ఆర్థిక సాధికారతతోనే మహిళలకు సమాజంలో గౌరవం పెరుగుతుందనడంలో సందేహం లేదు. కానీ, ఆ దిశగా అడుగులు వేసేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు చొరవ చూపడంలేదు. మహిళలు, బాలికల పట్ల వివక్ష అనేది సమాజంలో విడిగా లేదు. కుటుంబం నుంచే అది మొదలవుతుంది. ఇంట్లో మగ పిల్లలకున్న ప్రాధాన్యత ఆడపిల్లలకుండదు. సమాజంలోకి వెళ్తే లైంగిక వేధింపులు, దాడులు. సేవ్ ద చిల్డ్రన్స్ సంస్థ వరల్డ్ ఆఫ్ ఇండియాస్ గర్ల్స్ పేరుతో ఇచ్చిన నివేదిక ప్రకారం దేశంలోని బాలికల్లో సగంమంది తమకు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ లేదని ఆందోళన చెందుతున్నారు. తమ భయాల గురించి ఇంట్లో చెబితే అసలు బయటకే రానివ్వరని తమలోతామే కుమిలిపోతున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన తల్లిదండ్రులు తొందరగా పెండ్లిళ్లు చేసి చేతులు దులిపేసుకునేందుకే మొగ్గు చూపుతున్నట్టు నివేదిక వెల్లడించింది.
దేశంలోని సగభాగమైన మహిళలు, బాలికలకు రక్షణ లేనపుడు, బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేందుకే భయపడుతున్న పరిస్థితుల్లో అనూహ్య ఆర్థిక రేట్ దిశగా దూసుకుపోతున్నామనడం అర్థరహితమే అవుతుంది. ఆర్థిక కార్యకలాపాల్లో సగభాగం బాగస్వామ్యం తగినంత లేనపుడు అనూహ్య ఫలితాలు ఎలా సాధ్యమవుతాయి.? మహిళల రక్షణ పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు చేపడ్తే తప్ప, వారికి ఆర్థిక సాధికారత కల్పిస్తే తప్ప దేశ వృద్ధిరేట్లో అనూహ్య మార్పులేమీ సాధ్యం కాదని ప్రపంచ నివేదికల్లో స్పష్టమైంది. విద్య, ఉద్యోగాల్లో వారికి తగిన భాగస్వామ్యం దక్కినపుడే దేశం అనుకున్నరీతిలో అభివృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ నివేదికలు తేల్చి చెప్పాయి.