Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి లేఖ
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
శ్రీశైలం సొరంగ మార్గం(ఎస్ఎల్బీసీ) పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావుకు ఆయన లేఖ రాశారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను 2017-18 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీనిచ్చినా నేటికీ ఆ హామీ నెరవేరలేదని చెప్పారు. ఇంకా 30శాతం ప్రాజెక్టు పనులు చేయాల్సి ఉందని తెలిపారు. టన్నెల్ (1) 43కిలోమీటర్లకు గానూ 11.5కిలోమీటర్లు మిగిలి ఉందని, టన్నెల్ (2) కాంక్రీట్ లైనింగ్ వర్క్ సగమే పూర్తయిందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ పనులు 50శాతం మాత్రమే జరిగాయని తెలిపారు. దీనికి అవసరమైన సుమారు 1200 ఎకరాల భూసేకరణ ఇంకా పూర్తి కాలేదని, మరో రిజర్వాయర్ పెండ్లిపాకల పనులు కేవలం 25శాతం మాత్రమే జరిగాయని చెప్పారు. టన్నెల్ 1 అవుట్లెట్ నుంచి తవ్వుతున్న టీబీఎం మిషన్ రిపేర్కు వచ్చిందనీ, దానికి తిరిగి రిపేర్ చేయాలంటే రూ.60కోట్లు అవసరమవుతుందని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. నిధుల కోసం సర్కార్కు ప్రతిపాదనలు పంపినా, ఫలితం లేకపోవడంతో పనులు నిలిపివేసినట్టు వారు పేర్కొంటున్నారని చెప్పారు. నత్తనడకన పనులు సాగుతుండటంతో ఎస్ఎల్ఈసీ ఆయకట్టులోని ప్రజలు, రైతాంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నదని లేఖలో తెలిపారు.
సొరంగమార్గం పూర్తయితే 4వేల క్యూసెక్కులు, 30 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు అవకాశముంటుదని పేర్కొన్నారు. తద్వారా 3.20వేల ఎకరాల ఆయకట్టు సాగుకు నీరందడంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని అన్ని గ్రామాలకు రక్షిత మంచి నీరు అందించే అవకాశముందని చెప్పారు. ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన రూ.1500కోట్లు విడుదల చేయాలని కోరారు.