Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేసీకి తల్లిదండ్రుల ఫిర్యాదు
- వార్డెన్, వాచ్మెన్ సస్పెన్షన్కు ఇన్చార్జి డీఆర్వో ఆదేశాలు
నవతెలంగాణ - పెద్దపల్లి రూరల్
పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఆకతాయిల ఆగ డాలు శృతిమించాయి. అర్ధరాత్రి వసతి గృహంలో చొరబడి గిరిజన విద్యార్థులపై దాడి చేస్తూ భయ బ్రాంతులకు గురిచేస్తున్నారు. వార్డెన్ పట్టించుకోకపోవడంతో టీసీలు తీసుకుని వెళ్లిపోతామని పిల్లలు సిద్ధమవ్వగా చివరకు అధికారులు స్పందించి చర్యలకు ఉపక్రమించారు. వివరాలిలా ఉన్నాయి..
వసతి గృహంలో జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లికి చెందిన 8 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే, పట్టణానికి చెందిన కొంత మంది ఆకతాయిలు అర్ధరాత్రి విద్యార్థులపై దాడి చేసి గాయపర్చారు. ఘటన జరిగిన మరుసటి రోజు విద్యార్థులు వార్డెన్కు తెలిపారు. ఆయన నగర పంచాయతీ ప్రజాప్రతినిధితో చర్చలు జరిపి ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో విద్యార్థులకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. హాస్టల్కు చేరుకున్న తల్లిదండ్రులు మూడు రోజులు వసతిగృహంలోనే ఉండి పరిస్థితిని గమనించారు. ఆదివారం సాయంత్రం జిల్లా సాంఘిక సంక్షేమాధికారి మొగులయ్య వచ్చి విద్యార్థులతో మాట్లాడుతున్న సమయంలోనే ఆకతాయిలు లోపలికి మద్యం బాటిల్ విసిరారు. దాంతో సదరు అధికారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. జిల్లా అధికారి ముందే ఆకతాయిలు రెచ్చిపోవడంతో తమ పిల్లలకు ఇక్కడ రక్షణ లేదంటూ సోమవారం టీసీలు తీసుకుని వెళ్లేందుకు తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. అదే సమయంలో జేసీ వనజాదేవికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వార్డెన్ రాజయ్య, వాచ్మెన్ రాజశేఖర్ను సస్పెండ్ చేస్తూ ఇన్చార్జి డీఆర్వో బైరం పద్మయ్య ఆదేశాలు జారీ చేశారు.