Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరక్కాయల పేరుతో రూ.54 కోట్లు టోకరా
నవతెలంగాణ-కేపీహెచ్బీ
కేజీ కరక్కాయలు పొడి చేసి ఇస్తే రూ.300 కమీషన్ ఇస్తామంటూ నమ్మబలికి స్థానికులకు భారీగా టోకరా కొట్టారు. ప్రజల నుంచి రూ.కోట్ల డిపాజిట్లు చేయించుకుని ఉడాయించారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కేపీహెచ్బీలో సోమవారం వెలుగు చూసింది. సీఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిరుద్యోగులు, మహిళలు, గృహిణులకు ఉపాధి కల్పిస్తామని నెల్లూరు జిల్లాకు చెందిన మల్లికార్జున్ కేపీహెచ్బీ ఒకటో రోడ్డులో 2018 మార్చిలో సాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ మల్టీఫుడ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ ప్రారంభించాడు. అదే నెలలో సుమన్ టీవీ చానల్ ద్వారా వ్యాపార ప్రకటనలు వెలువరించారు. కరక్కాయ పొడిని కొన్ని ఆయుర్వేద సంస్థలకు సరఫరా చేస్తున్నట్టు.. కంపెనీకి రూ.1000 డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయ ఇస్తామని దానిని పొడి చేసి ఇస్తే తిరిగి రూ.1300 ఇస్తామని ప్రకటనలు చేయించారు. దాన్ని నమ్మిన అనేక మంది మహిళలు కంపెనీకి రూ.1000 నుంచి రూ.10 వేల వరకు డిపాజిట్ చేసి కరక్కాయలు తీసుకుని పొడి చేసి తిరిగి ఇచ్చారు. ఇలా మూడు నాలుగు నెలలు ప్రజలకు నమ్మకం కలిగేలా వ్యవహరించారు. లాభాలు అధికంగా వస్తాయని నమ్మిన అనేక మంది కంపెనీకి రూ.5 కోట్ల వరకు డిపాజిట్లు చేశారు. ఆరు నెలల తర్వాత డిపాజిట్లు తిరిగి ఇచ్చే విధంగా ఆ కంపనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా కంపెనీ మేనేజర్ మల్లికార్జున్ ఫోన్ పని చేయడం లేదు. అనుమానం వచ్చిన బాధితులు ఆఫీసుకు వస్తే తాళం వేసి ఉంది. దీంతో తామంతా మోసపోయామని గమనించారు. 51 మంది బాధితులు సోమవారం కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ భుజంగరావు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు నిందితుని కోసం గాలిస్తున్నాయి. కేసు దర్యాప్తులో ఉంది.