Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదు సీట్లు ఉన్న బీజేపీ అధికారంలోకి వస్తదట
- ఐటీఐ కోర్సులతో 60 శాతం మందికి ఉపాధి: నాయిని
- ఫుడ్, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు: కేటీఆర్
నవతెలంగాణ-సిరిసిల్ల/తంగళ్లపల్లి
కాంగ్రెస్ పార్టీలో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే.. అందులో ఎవరో ముందు తేల్చుకోవాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో రూ.7కోట్ల 75లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ఐటీఐ కళాశాల భవన సముదాయాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు, పనులపై కోర్టులో కేసులు వేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు. ఐదు సీట్లు ఉన్న బీజేపీ కూడా రాష్ట్రంలో తాము అధికారంలోకి వస్తామని ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని దీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 22 ప్రభుత్వ, 220 ప్రయివేట్ ఐటీఐ కళాశాలల్లో సుమారు 50 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారన్నారు. వారికి 72 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి, 60 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు.
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారని చెప్పారు. స్వయం ఉపాధినిచ్చే కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వ్యవసాయ రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతున్నందున ఫుడ్, అగ్రి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకూ కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న 96 గ్రామీణ నియోజకవర్గాల్లో ఆహార పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఆహార శుద్ధి పాలసీలను తీసుకొస్తామన్నారు. అపెరల్ పార్క్ ఏర్పాటు ద్వారా 15 నుంచి 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. వీరిలో 30శాతం మంది మహిళలే ఉంటారన్నారు. మహిళలకు వంద శాతం రాయితీతో కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మరమగ్గాల కాటన్ పరిశ్రమలకు అవసరమైన కోర్సులు లేవని, టెక్స్టైల్ పార్క్ లేదా అపెరల్ పార్క్లో ప్రత్యేకమైన ఐటీఐ కేంద్రం, మరమగ్గాలకు సంబంధించిన డిప్లమా కోర్సులు ప్రవేశపెట్టాని హోంమంత్రి నర్సింహారెడ్డిని కోరారు. కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావు, జెడ్పీచైర్పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, కలెక్టర్ కృష్ణభాస్కర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఆకునూరి శంకరయ్య పాల్గొన్నారు.