Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హెకీ అధికారాలను గ్రాంట్స్ కమిషన్కే ఇచ్చి బలోపేతం చేయాలి
- విద్యాసంస్థలకు నిధులిచ్చే బాధ్యత ఇవ్వాలి
- ఎంహెచ్ఆర్డీ నియంత్రణ ఉండొద్దు
- హెకీ తప్పనిసరైతే విస్తృత చర్చ అవసరం:ఉన్నత విద్యామండలి మేధోమథనంలో విద్యావేత్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొనసాగించాల్సిందేనని ఉన్నత విద్యామండలి మేధోమథనంలో పలువురు వీసీలు, విద్యావేత్తలు, మేధావులు చెప్పారు. భారత ఉన్నత విద్యా కమిషన్ (హెకీ)కి ప్రతిపాదించిన అధికారాలన్నీ యూజీసీకి బదలాయించి మరింత బలోపేతం చేయాలని సూచించారు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కాలేజీలను నియంత్రించే అధికారమంతా యూజీసీకి కట్టబెట్టాలని కోరారు. ఒకవేళ హెకీని అమల్లోకి తేవడం తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం భావిస్తే హడావుడిగా కాకుండా దేశవ్యాప్తంగా విస్తృతంగా అభిప్రాయాలు సేకరించాలని, లోతైన చర్చ అవసరముం టుందని అన్నారు. హెకీ నిర్మాణమంతా యూజీసీ తరహాలో అకడమిషియన్లతో ఉండాలని సూచించారు. బ్యూరోక్రాట్లు ఎక్కువ మంది ఉండడం, నిర్ణయాధికారం వారి చేతుల్లో ఉండడం తగదని అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఆర్డీ) నియంత్రణ ఉండొద్దని కోరారు. కొత్తగా ప్రతిపాదించే హెకీ కేవలం విద్యాసంస్థలను నియంత్రించే సంస్థగా, నిధులపై అధికారమంతా ఎంహెచ్ ఆర్డీ గుప్పిట్లో ఉండడం సమంజసం కాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యారంగం ఉమ్మడి జాబితాలో ఉందని, హెకీ అమల్లోకి వస్తే రాష్ట్రాల హక్కులు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తాయని చెప్పారు. రాష్ట్రాల హక్కులకు భంగం కలిగించి కేంద్రం పెత్తనం చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడ్డారు. యూజీసీని రద్దు చేసి దాని స్థానంలో హెకీని అమల్లోకి తేవాలని ఎంహెచ్ఆర్డీ ప్రకటించిన విషయం తెలిసిందే. హెకీ బిల్లు-2018పై ఈనెల 20వ తేదీ వరకు అభిప్రాయాలను పంపాలని ఎంహెచ్ఆర్డీ కోరింది. అందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామం డలి ఆధ్వర్యంలో మేధోమథనం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పార్లమెంటు సభ్యులు కె కేశవరావు, అసదుద్దీన్ఓవైసీ, ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మెన్లు ఆర్ లింబాద్రి, వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కాలేజీయేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వీసీ కె సీతారామారావు, ఇతర విశ్వవిద్యాల యాల వీసీలు, ఓయూ మాజీ వీసీ తిరుపతిరావు, విద్యాపరి శోధన, విశ్లేషణ కేంద్రం (సెరా) కన్వీనర్ నాగటి నారాయణ, కో కన్వీనర్ నాగేశ్వర్రావు, ఏఐఎఫ్యూసీటీవో ఉపాధ్యక్షులు రత్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రాల హక్కులను కేంద్రం తీసుకోవడం సరికాదు : కడియం
యూజీసీ స్థానంలో హెకీ పేరుతో కేంద్రం తెచ్చే నూతన సంస్కరణ సామాన్యులకు ఉన్నత విద్య అందేలా ఉండాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ సంస్కరణ అయినా, కొత్త విధానమైనా విద్యావ్యాప్తికి దోహదపడాలని సూచిం చారు. హెకీని ఎవరూ గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగపరంగా ఉన్న రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం హస్తగతం చేసుకోవడం సరైంది కాదని చెప్పారు. విశ్వవిద్యాలయాలకు నేరుగా నిధులిచ్చే అధికారం ఆయా సంస్థలకే ఉండాలని సూచించారు. పేదలు, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడ్డ వారికి ఉన్నత విద్యను అందించే ఉద్దేశం ఈ బిల్లులో కనిపించడం లేదన్నారు. విశ్వవిద్యాల యాల స్వయంప్రతిపత్తిని దెబ్బతీసేలా హెకీ ప్రతిపాదనలు న్నాయని చెప్పారు. ఈ బిల్లులో కొన్ని అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. పేద విద్యార్థులకు నష్టం కలుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలు, పేద విద్యార్థుల అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలుం డాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు, కాలేజీల కు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చే అధికారముండేదని చెప్పారు. ఇకనుంచి కేంద్రం అనుమతి పొందడం తప్పనిసరి అవుతుందని అన్నారు. హెకీ నిర్మాణంలో అధికారులు తక్కువ, అకడమిషియన్లు ఎక్కువ మంది ఉండాలని సూచించారు. ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు అధ్యాపకుల శిక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. వీసీ, చాన్సలర్, అధ్యాపక ఖాళీలు ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని కోరారు. విద్యారంగానికి కేంద్రం నిధుల కేటాయింపును పెంచాలని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక విద్యారంగానికి నిధులు ఏటా తగ్గుతున్నాయని అన్నారు. ఈ సవరణలు చేయాలని కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. ఈ బిల్లుపై చర్చించి ఈనెల 20వ తేదీలోపు కేంద్రానికి నివేదిక పంపుతామని అన్నారు. కేంద్రం ఆమోదించకపోతే పార్లమెంటులో ఈ అంశాలను లేవనెత్తుతామని చెప్పారు.
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం : కేశవరావు
భారత ఉన్నత విద్యా కమిషన్ (హెకీ) బిల్లులోని అంశాలు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని టీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు అన్నారు. ఈ బిల్లులోని ప్రతి సెక్షన్ సవాల్ చేసే విధంగా ఉందని చెప్పారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వమే పాఠ్యాం శాలను రూపొందించాలనుకోవడం సరైంది కాద న్నారు. విద్యావ్య వస్థను అధికారుల చేతుల్లో పెట్ట డం సరైంది కాదని చెప్పారు. ఈ బిల్లులో ఎన్నో భిన్నమైన అంశాలున్నాయని అన్నారు.
ఇది అన్ని వర్గాలకూ వ్యతిరేకం : అసదుద్దీన్ ఓవైసీ
హెకీ బిల్లు అన్ని వర్గాల అభిప్రాయాలకూ వ్యతిరేకంగా ఉందని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. హెకీ ముసాయిదా బిల్లుపై అభిప్రాయాలు చెప్పేందుకు ఇచ్చిన సమ యం సరిపోదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్రా ్టలపై ఒత్తిడి పెంచేదిగా ఉందన్నారు. హెకీ అమ ల్లోకి వస్తే వివిధ కోర్సుల ఫీజులు పెరుగుతాయని, కేంద్రం నుంచి విద్యాసంస్థలకు వచ్చే గ్రాంట్లు తగ్గుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. హెకీలో ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వారే ఉంటారని అన్నారు. ఇది రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని చెప్పారు. ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించాలని కోరారు.
యూజీసిని రద్దు చేస్తే నియంత్రణ పెరుగుతుందా? : పాపిరెడ్డి
యూజీసీని రద్దు చేస్తే నియంత్రణ వ్యవస్థ మెరు గుపడుతుందా?అని ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డి అన్నారు. పర్యవేక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని సూచించారు. యూజీసీ లేదా హెకీ ఏది ఉన్నా భారత్లో ఉన్న విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాలని ఆకాంక్షించారు. కొత్తగా ప్రతిపాదిస్తున్న హెకీకి నియంత్రించే అధికారాలు ఏమున్నాయని అన్నారు. న్యాక్, ఇతర సంస్థల భవిష్యత్తు ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోందని చెప్పారు.
హెకీ ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించాలి
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని రద్దు చేసి భారత ఉన్నత విద్యా కమిషన్ (హెకీ)ని అమలు చేయాలన్న ప్రతిపాదనను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుతాన్ని విద్యాపరిశోధన, విశ్లేషణ కేంద్రం (సెరా) డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపిరెడ్డిని సెరా కన్వీనర్ నాగటి నారాయణ, కో కన్వీనర్ నాగేశ్వర్రావు, ఏఐఎఫ్యూసీటీవో ఉపాధ్యక్షులు రత్న ప్రభాకర్ కలిసి వినతిపత్రం సమర్పించారు. యూజీసీని రద్దు చేసి, హెకీ అమల్లోకి వస్తే విద్యారంగం కేంద్రీకృతమవుతుందని ఓ ప్రకటనలో తెలిపారు.
యూజీసీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి:పీడీఎస్యూ
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) డిమాండ్ చేసింది. సోమవారం హైదరాబాద్లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ తుమ్మల పాపి రెడ్డిని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జూపాక శ్రీనివాస్, కార్య దర్శి బి రాము నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.