Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అజహర్ ప్రకటన.. అంజన్ ఆగ్రహం...
- సికింద్రాబాద్ సీటుపై గరంగరం
- వచ్చేసారి అక్కణ్నుంచే పోటీ చేస్తానన్న అజ్జూభారు
- చేతనైతే హైదరాబాద్ నుంచి బరిలోకి దిగాలన్న అంజన్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ప్రకటించడం ఆ పార్టీలో విభేదాలకు దారితీసింది. అజహర్ ప్రకటన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ నగర కమిటీ సమావేశం రసాభాసాగా ముగిసింది. సమావేశంలో అజహర్ ప్రకటనపై అంజన్కుమార్ యాదవ్ వర్గం ఆందోళనకు దిగింది. ఏఐసీసీ ఇన్ఛార్జి బోస్ రాజు ముందే అంజన్ అనుచరులు అజహరుద్దీన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేతనైతే హైదరాబాద్ నుంచి పోటీ చేయాలంటూ అజహర్కు వారు సవాల్ విసిరారు. గ్రేటర్ కాంగ్రెస్ సమావేశంలో గొడవ ముదరడంతో అక్కడే ఉన్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యానారాయణ కార్యకర్తలను సముదాయించేం దుకు ప్రయత్నిం చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని అంజన్కే కేటాయిస్తారంటూ సర్వే సత్యనారాయణ సర్ది చెప్పజూశారు. అదే సమావేశంలో అంజన్ కుమార్ మాట్లాడుతుండగా సీనియర్ నేత వీహెచ్ లేచి వెళ్లిపోవటం గమనార్హం. దీంతో అంజన్ వర్గీయులు మరింత ఆగ్రహానికి గురయ్యారు. అజహర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సమావేశం జరగకుండా అడ్డుకున్నారు. ప్రధాన నేతల ముందే అంజన్ వర్గీయులు ఆందోళన చేస్తుంటే ఏం జరుగుతుందో తెలియక వారు తెల్లమొహం వేశారు. అంజన్ వర్గీయులను సముదాయించేందుకు ఉత్తమ్ పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఎవరికి పడితే వారికి సీట్లు కేటాయిస్తే సహించబోమంటూ వారు హెచ్చరించారు.
ఎవరొచ్చినా ఊరుకునేది లేదు : అంజన్
ఈ సందర్భంగా అంజన్ కుమార్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోటీకి ఎవరొచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. భవిష్యత్తులో నగర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతానని తెలిపారు. అజహర్కు రాష్ట్ర రాజకీయాల గురించి ఏమాత్రం అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఏండ్ల నుంచి పార్టీనే నమ్ముకుని ప్రజలకు సేవ చేస్తున్న తనను కాదని సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానంటూ అజహర్ ప్రకటించటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఏ హోదాలో మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించారు. ఆయనకు ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం అంటూ ఏదీ లేదని విమర్శించారు. గతంలో కూడా ఆయన ఇదే రకంగా ప్రకటనలు గుప్పించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ అయినప్పటికీ ఎవరు పడితే వారు.. ఎక్కడ పడితే అక్కడ పోటీ చేసే అవకాశం లేదన్నారు. అజహర్ ఎప్పుడైనా క్రీయాశీల రాజకీయాల్లో పాల్గొన్నారా? అని ప్రశ్నించారు. ఆయన ఇప్పటికీ ప్రజలకు ఒక క్రికెటర్గానే తెలుసునని అన్నారు. అసలు అజహర్ ఒక రాజకీయ నాయకుడున్న విషయం తమ పార్టీలోనే కొందరికి తెలియదని ఎద్దేవా చేశారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజలకు సేవలందించే వారినే జనం ఆదరిస్తారన్న విషయాన్ని పార్టీ అధిష్టానం గుర్తుంచుకోవాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎవరడ్డొచ్చినా తాను సికింద్రాబాద్ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ సికింద్రాబాద్ సీటును ఇంకెవరికైనా కేటాయిస్తామని ప్రకటించలేదుగదా? అని ప్రశ్నించారు. ఒకవేళ అజహర్ సికింద్రాబాద్ నుంచి గాకుండా హైదరాబాద్ నుంచి పోటీచేస్తే మాత్రం తప్పకుండా సహకరిస్తానని తెలిపారు. అందరినీ కలుపుకుని పార్టీని బలోపేతం చేసేందుకు కషిచేస్తామని చెప్పారు. కాంగ్రెస్ నగర కమిటీ సమావేశానికి మాజీ మంత్రి ముఖేశ్గౌడ్, ఇతర నేతలు డుమ్మా కొట్టారు. ఆయన ఎందుకు రాలేదనే విషయం తనకు తెలియదని అంజన్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.