Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అప్పు తీర్చుకునేందుకు దారుణానికి ఒడిగట్టిన వైనం
- మేడ్చల్ జిల్లా ఉప్పల్లో ఘటన
నవతెలంగాణ- హైదరాబాద్ సిటీబ్యూరో
స్నేహితుని వద్ద ఉన్న ఖరీదైన సెల్ఫోన్పై కన్నేసి దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్టేషన్ పరిధిలో సోమవారం కలకలం రేపింది. మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వర్శర్మ ఉప్పల్ ఏసీపీ సందీప్రావుగోనె, అడిషనల్ సీఐ ముధుకుమార్, ఎస్ఐ అంజనేయులతో కలిసి సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ ప్రాంతానికి చెందిన గడ్డం ప్రేమ్సాగర్ ఉప్పల్ రామంతాపూర్లో నివాసముంటున్నాడు. ఇదే ప్రాంతంలో ఉండే సురేష్ కుమారుడు ప్రేమ్(17) ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు నాటకాలు వేస్తూ.. మిగతా సమయాల్లో టైలరింగ్ చేస్తారు. సాగర్, ప్రేమ్లు స్నేహితులు. సాగర్ గతంలో డెలివరీ బారుగా పని చేసి మానేశాడు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అప్పులు చేశాడు. ఈ క్రమంలో ప్రేమ్ వద్ద ఉన్న ఖరీదైన సెల్ఫోన్పై సాగర్ కన్నేశాడు. ఈ నెల 13న లాంగ్ డ్రైవ్కు వెళ్దామని చెప్పి ప్రేమ్ను బైక్పై ఇంటి నుంచి తీసుకుపోయాడు. నాదర్గూల్ గ్రామ సమీపంలో బైక్లో పెట్రోల్ పోయించుని, మరో లీటర్ను బాటిల్లో పోయించుకున్నాడు. ఔటర్ రింగ్రోడ్డు మీదుగా ఆదిబట్ల ప్రాంతంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కాసేపు కూర్చుని ఫోన్ చూస్తున్న ప్రేమ్ తలపై సాగర్ కట్టెతో గట్టిగా కొట్టాడు. స్పృహ కోల్పోయిన ప్రేమ్ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం సెల్ఫోన్ తీసుకుని ఇంటికొచ్చేశాడు. రాత్రి అయినా కొడుకు ఇంటికి రాకపోవడంతో ప్రేమ్ తండ్రి శంకర్ ఉప్పల్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాగర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తే ప్రేమ్ను ఇంటివద్దే దించేసినట్టు అబద్దాలు చెప్పాడు. పొంతన లేని సమాధానాలు చెప్పడంలో అనుమానం వచ్చిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీతో పాటు సెల్ఫోన్ డాటా పరిశీలించారు. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో సెల్ఫోన్ కోసం తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకొని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.