Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంఠేశ్వర్
రాష్ట్రంలో ఎంబీసీల సంక్షేమాన్ని, సమస్యలను విస్మరిస్తున్న రాజకీయ పార్టీలను ఎన్నికల్లో ఓడించాలని తెలంగాణ అంత్యంత వెనుకబడిన కులాల సంఘం (ఎంబీసీ)రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఏఎల్.మల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్ ధర్నాచౌక్లో నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో 112 బీసీ సామాజిక తరగతులు ఉన్నాయని, అందులో అసెంబ్లీ వరకు వెళ్లినవి 5 తరగతులేనని చెప్పారు. పంచాయతీ, జెడ్పీ, ఎంపీపీ, మున్సిపల్ వరకు 8 బీసీ సామాజిక తరగతులే స్థానిక సంస్థల్లోకి వెళ్లగలిగాయని, అంటే ఇంకా 104 తరగతులు కనీసం పంచాయతీ గడప తొక్కలేదని వివరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లలో ఏ,బీ,సీ,డీ వర్గీకరణ చేశాకే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి సొసైటీకీ వ్యక్తిగత రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఎంబీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని, అలాగే దాడులను అరికట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. ఎంబీసీ ఉద్యమానికి నిజామాబాద్ పోరాటమే ఆదర్శంగా నిలిచిందన్నారు. సంఘం ఏర్పడక ముందే నిజామాబాద్లో పోరాటం మొదలైందన్నారు. బీసీ రిజర్వేషన్ల ఏబీసీడీ వర్గీకరణ కోసం న్యాయస్థానంలో పోరాడుతూనే మరోవైపు నిజామాబాద్ నుంచి క్షేత్రస్థాయిలో ప్రత్యేక పోరాటం ప్రారంభించామని చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పిం చాల ని కలేలెకర్, అనంతరామన్ కమిషన్ నివేదికలు ఇచ్చి నప్పటికీ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబీసీల పట్ల వివక్ష చూపుతున్నాయని అన్నారు. కార్య క్రమంలో జాతీయ సంచార అర్ధ సంచారజాతుల కన్వీనర్ మల్లె సుబ్బారావు, ఎంబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దండి వెంక ట్, రాంమోహనచారి, ముత్యాల రాంబాబు, సీపీఐ (ఎం) నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రమేశ్బాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్ పాల్గొన్నారు.