Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రాజాసింగ్ గృహ నిర్బంధం : లక్ష్మణ్, కిషన్రెడ్డి సహా పలువురు నేతల అరెస్టు
నవతెలంగాణ - కంటోన్మెంట్
స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ నగరం నుంచి బహిష్కరించటాన్ని నిరసిస్తూ.. బీజేపీ రాష్ట్ర నేతలు మంగళవారం నిర్వహించిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. వారందరినీ హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో అరెస్టు చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ను ఆయన ఇంట్లోనే నిర్బంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ను అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కిషన్రెడ్డిని అరెస్టు చేసి కంచన్బాగ్ స్టేషన్కు తరలించారు. వీరితోపాటు ఎమ్మెల్సీ రామచంద్రరావును, ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ను, చింతల రామచంద్రారెడ్డిని అరెస్టు చేశారు.
అంతకుముందు లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ను ముట్టడించేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు యత్నించారు. మరోవైపు తిరుమలగిరిలోనూ రాస్తారోకో చేశారు. లాల్బజార్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను ఊరేగించి దహనం చేసేందుకు నాయకులు యత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మణ్ను అక్కడే అరెస్టు చేసి తిరుమలగిరి పోలీస్స్టేషన్కు తరలించారు. లక్ష్మణ్ అరెస్టును నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు పోలీస్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. సాయంత్రం ఐదున్నరకు లక్ష్మణ్ను విడుదల చేయడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బ్రిటిష్ పాలన కంటే అధ్వానంగా పాలన సాగుతోందని విమర్శించారు.