Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మానకొండూర్/కోనరావుపేట
అప్పులబాధతో రాజన్నసిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో మంగళవారం ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం...కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం కొండపల్కల గ్రామానికి చెందిన కంది వీరారెడ్డి (38) తన రెండెకరాలతో పాటు మరో రెండెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబంతో జీవిస్తున్నాడు. నాలుగెకరాల్లో వరి పంట సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో రూ. 2 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పుల బాధతో తరుచూ చర్చిస్తూ మదనపడుతుండేవాడు. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం పొలం వద్దకెళ్లాడు. అప్పుల బెంగతోనే పశువుల కొట్టంలో ఉరేసుకున్నాడు. చుట్టుపక్కల రైతులు గమనించి మృతుని కుటుంబ సభ్యులకు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కోటేశ్వర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన చీకటి లచ్చయ్య తన ఎకరంన్నర వ్యవసాయ భూమిని నమ్ముకుని జీవిస్తున్నాడు. గతేడాది పత్తి వేసి అప్పులపాలయ్యాడు. సుమారు రూ. 6 లక్షలవరకు అప్పులయ్యాయి. 'పొలం సాతిత్తలేదు. అప్పులు ఎట్టా తీర్చుడో' అని ఎప్పుడు మదనపడుతుండే వాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం తన పొలం వద్ద పురుగుల మందు తాగి లచ్చయ్య (55) ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మి, కూతరు అనుష, ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వైస్ ఎంపీపీ కచ్చకాయల ఎల్లయ్య కోరారు.