Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నకిరేకల్ టికెట్ నాకే : చిరుమర్తి
- చిరుమర్తి లింగయ్యది ఒంటెద్దు పోకడ : ప్రసన్నరాజ్
నవతెలంగాణ-నకిరేకల్
కాంగ్రెస్ పార్టీలో నల్లగొండ జిల్లా నాయకుల ఆధిపత్య పోరు రోజురోజుకీ మంగళవారం తారాస్థాయికి చేరుతున్నది. భువనగిరిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమావేశంలో నిన్న జరిగిన గొడవపై నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నకిరేకల్లో విలేకర్లతో మాట్లాడుతూ...కోమటిరెడ్డి బ్రదర్స్ తనకు రాజకీయ గురువులని, వారిని విమర్శిస్తే ఉరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీలోని మరో గ్రూపు నాయకులను హెచ్చరించారు. ఉనికి కాపాడుకునేందుకు ఎమ్మెల్యేలు వేముల వీరేశం, భాస్కర్రావు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ దఫా ఆ ఇద్దరికీ టికెట్లు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. రౌడీయిజంతో రాజకీయం చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి గాని, తనకు గాని లేదన్నారు. ఎన్ని విష ప్రచారాలు చేయించినా నకిరేకల్ టికెట్ కాంగ్రెస్ తరుపున తనకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ విజ్ఞత లేని టీఆర్ఎస్ నాయకులు తనను జీతగాడని సంభోదించడం వాళ్ల అవివేకానికి నిదర్శనమన్నారు. దళిత కుటుంబంలో పుట్టిన వారల్లా జీతగాళ్లలైతే...తనను సంభోదించిన ఆ నాయకుడు ఎవరికి జీతగాడని ప్రశ్నించారు.
చిరుమర్తిది ఒంటెద్దు పోకడ : నలగాటి ప్రసన్నరాజ్
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఒంటెద్దు పోకడతో కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్నాడని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు నలగాటి ప్రసన్నరాజ్ దుయ్యబట్టారు. నకిరేకల్లోనే వేరుగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రస న్నరాజ్ మాట్లాడుతూ... ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో చిరుమర్తి పార్టీ కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో చెల్లాచెదరవుతున్నారన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, నాయకునిగా పార్టీ అభివృద్ధే లక్ష్యంగా నియోజకవర్గంలో ముందుకు సాగుతున్నట్టు చెప్పారు. భువనగిరిలో సోమవారం జరిగిన పార్టీ పార్లమెంట్ స్థాయి సమీక్ష సమావేశానికి ఎమ్మెల్యే టికెట్ను ఆశించి దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లాలని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం జరిగే సమీక్షా సమావేశాన్ని కలహాలకు వేదికగా కోమటిరెడ్డి బ్రదర్స్ మార్చారన్నారు. సమీక్షా సమావేశంలో వారు ఏకపక్షంగా వ్యవహరించారని, సమావేశంలో యువజన కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి యాదగిరిపై చిరుమర్తి అనుచరులు దాడికి దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. యాదగిరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.